కాంగ్రెస్‌ను బతికించేందుకు బాబు యత్నం

– ఎన్టీఆర్‌ ఆశయాలను కాలరాసేలా బాబుతీరు
– బాబు అవినీతికి చరమగీతం పాడుతాం
– బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు
న్యూఢిల్లీ, అక్టోబర్‌2(జ‌నంసాక్షి) : చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని, ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ వ్యక్తిని కాంగ్రెస్‌లోకి పంపి తెలంగాణలో కాంగ్రెస్‌ను బతికించేందుకు ప్రయత్నించారని  బీజేపీ నేత సోమువీర్రాజు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు బాబు యత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌ ఆశయాలను కాలరాసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని సోమువీర్రాజు అన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలను నడుపుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు అవినీతికి చరమగీతం పాడబోతున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌, ఇళ్ల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణంలోనూ అవినీతే అని ఆరోపించారు. చంద్రబాబు
రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుపుతున్నారని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, రాష్ట్రానికి పారిశ్రామిక కంపెనీలను తీసుకొస్తామని చెప్పి పలుమార్లు విదేశాలకు వెళ్లి చంద్రబాబు.. తన సొంత పనులను పూర్తిచేసుకొని రాష్ట్రానికి ఎటువంటి మేలు చేకూర్చలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని, కానీ వాటిని వినియోగించుకుంటూనే ఏపీకి కేంద్రం ఏ న్యాయం చేయడం లేదని అంటున్నాడని ఈ సందర్భంగా సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు పాలన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.