కాంగ్రెస్‌ జాబితా మరో వారం ఆలస్యం

ఈనెల 8లేదా 9న ప్రకటన

పొత్తులు తేలాకనే మొత్తంగా ప్రకటించే అవకాశం

టిడిపితో కుదిరిన సయోధ్య: 14 సీట్లు కేటాయింపు

ఢిల్లీలో విూడియాకు కుంతియా, ఉత్తమ్‌ల వెల్లడి

న్యూఢిల్లీ,నవంబర్‌1(జ‌నంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదల మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 8 లేదా 9 తేదీల్లో రాహుల్‌ గాంధీ జాబితా విడుదల చేయనున్నారు. ప్రాథమిక జాబితాతో ఢిల్లీ చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో రాహుల్‌ చర్చించారు. అలాగే పొత్తులపైనా చర్చించారు. జాబితాపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు పరిశీలించిన స్థానాల్లో అభ్యర్థుల ఖరారు ఓ కొలిక్కి వచ్చిందని చెప్పారు. అభ్యర్థుల జాబితా మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయాలా..? వద్దా? అనే విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్‌ వివరించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఉత్తమ్‌ విూడియాతో మాట్లాడారు. అభ్యర్థుల జాబితాను ఈనెల 8 లేదా 9న ప్రకటిస్తామన్నారు. తెదేపాతో 14 సీట్లకు అంగీకారం కుదిరిందని.. తెజస, సీపీఐతో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని ఉత్తమ్‌ చెప్పారు. మొత్తం 95 స్థానాల్లో కాంగ్రెస్‌ బరిలో ఉంటుందని, మిగతా 24 స్థానాల్లో మిత్రపక్షాలు పోటీ చేస్తాయన్నారు. కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఈనెల 8న మరోసారి సమావేశమై అభ్యర్థుల జాబితాకు ఆమోదముద్ర వేసే అవకాశముంది. కూటమిలోని పార్టీలతో చర్చలు పూర్తయ్యాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కుంతియా చెప్పారు. ఎవరెవరు ఏయే స్థానాల్లో పోటీ చేస్తారన్నది చర్చిస్తున్నామని అన్నారు.

ఏకాభిప్రాయసాధన దిశగా చర్చలు సాగుతున్నాయని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాకు గురువారం ఆమోద ముద్ర పడే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ రాహుల్‌ పొత్తులు తేలాకే అన్ని స్థానాలు ప్రకటిస్తే బాగుంటుందని అన్నట్లు సమాచారం. గురువారం ఢిల్లీలో సోనియా నివాసంలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై చర్చించింది. సోనియా, ఏకే ఆంటోనీ, అహ్మద్‌పటేల్‌, అశోక్‌గెహ్లాట్‌, వీరప్ప మొయిలీ, గిరిజా వ్యాస్‌, షర్మిష్ఠముఖర్జీ, ఉత్తమ్‌, జానారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే పీసీసీల జాబితాను పరిశీలించిన స్క్రీనింగ్‌ కమిటీ ఆ జాబితాను ఎన్నికల కమిటీకి అందజేసింది. దీంతో మరో వారం రోజుల వరకు ఉత్కంఠ కొనసాగనుంది.