కాంగ్రెస్ తరహా రాజకీయాల్లో బిజెపి
మోడీ పాలనలో నెరవేరని హావిూలు
న్యూఢిల్లీ,జనవరి25(జనంసాక్షి): మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ నాలుగేళ్లలో ఇచ్చిన హావిూలను అమలు చేసే సంకల్పం లోపించింది. ప్రధానంగా ధరల పెరగుదల విషయంలో పట్టింపు లేకుండా పోయాయి. ఆహారధాన్యాలు ఉత్పత్తి అవుతున్నా వాటికి ధరలు దక్కడం లేదు. గోదాముల్లో ధాన్యం మగ్గుతుత్నా బయటకు రావడం లేదు. అలాగే దిగుమతులు కూడా తగ్గడం లేదు. కాంగ్రెస్ తరహా రాజకీయాలు చేస్తున్నారే తప్ప ఆదర్శ రాజకీయాలకు పెట్టింది పేరయిన బిజెపి ఇప్పుడా ముసుగు నుంచి బయటపడింది. ఇటీవలి పరిణామాలు కుటిల రాజకీయాలకు పరాకాష్టగా చెప్పుకోవాలి. బిజెపి లాంటి పార్టీ ఇలాంటి రాజకీయాలు చేయడం వల్ల సహజంగానే దానికున్ని ఇమేజ్ కాస్తా కరిగిపోయేలా చేసింది. ఇటీవల గుజరాత్లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠ మసకబారినా, ప్రధానంగా బిజెపికి రాజకీయాలకు చెరగని మచ్చని తెచ్చి పెట్టాయి. పాలన ఎలా ఉన్నా అవినీతి రహితంగా సాగుతుందన్న పేరు వచ్చింది. అయితే అమాత్యుల విషయంలో మాత్రం అలాంటి అపప్రథ ఉండనే ఉంది. అవినీతి లేకున్నా అక్రమ రాజకీయాలు సాగుతూనే ఉన్నాయి. ఈ నాలుగేళ్లూ అవినీతి మరక అంటకుండా మోదీ దేశాన్ని పాలించారన్న ప్రశంసలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ తరహా రాజకీయాలకు పెద్ద ఎత్తున తెరతీసారు. గత నాలుగేళ్లుగా తనవైపు వేలెత్తి చూపే అవకాశం లేకుండా మోదీ
జాగ్రత్తగా వ్యవహరించారు. తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేలా చేసుకున్నారు. అయితే పాలనలో మాత్రం అంతగా దూసుకుని పోవడం లేదు. ప్రధానంగా నోట్లరద్దు, జిఎస్టీతో ప్రజలకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఇక రాజకీయంగా చూస్తే అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో శివసేన పార్టీకి చెందిన ఎంపీ సురేశ్ ప్రభును ఆ పార్టీ అధిష్ఠానం అభిప్రాయానికి విరుద్ధంగా ఏకంగా కేబినెట్లోకి తీసుకుని మంచ తెచ్చుకున్నారు. గోవా, మణిపూర్, తదితర రాష్టాల్ల్రో రాజకీయ పెత్తనం సాగింది. బిహార్లో, గుజరాత్లో జరిగిన పరిణామాల వల్ల ప్రధాని మోదీ నైతికత, నిబద్ధత ప్రశ్నార్థకంగా మారాయి. బిహార్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన నితీశ్,లాలూ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ఇద్దరిని విడదీయడానికి కాచుకుని కూర్చున్నట్లుగా అమిత్షా, మోడీ ద్వయం అక్కడ అధికార కూటమిలో చిచ్చు పెట్టి సఫలం అయ్యారు. ఆ ఇద్దరు నాయకులూ విభేదాలు వచ్చి విడిపోలే ఈ ఇద్దరూ కష్టపడ్డారు. దీంతో గత ఎన్నికల్లో తిరస్కరణకు గురైన భారతీయ జనతా పార్టీ బిహార్ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది. కాంగ్రెస్ విముక్త భారత్ లక్ష్యంగా చేస్తున్న రాజకీయాలు ఒక్కోసారి వెగటుగా ఉంటాయనడానికి ఇటీవలి పరిణామాలు ఉదాహరణగా చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే క్రమంలో చేస్తున్న పనులన్నీ దేశహితం కోసమేనని సరిపెట్టుకోలేం. అలాగే గతంలో విూరు చేయలేదా అని ఎదురుదాడి చేయడం ఇటీవల అలవాటయ్యింది. మిగతా నాయకులకు, మిగతా పార్టీలకు, భారతీయ జనతా పార్టీకి చెందిన మోదీ,షాలకు కూడా తేడా లేదని ప్రజలు గుర్తించారు. ఈ క్రమంలోనే తప్పటడుగులు వేస్తున్నారు. దేశమంతటా అన్ని రాష్టాల్రలో భారతీయ జనతాపార్టీ పతాకం రెపరెపలాడా లన్నది ఈ ఇరువురి నాయకుల కోరిక! ఈ కారణంగానే ఇప్పుడు దక్షిణాదిపై దృష్టిపెట్టారు. తమిళనాడు లో పళనిస్వామి ప్రభుత్వాన్ని బుట్టలో వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీతి వాక్యాలు వల్లె వేస్తోంది గానీ దేశ రాజకీయాలు ఇవ్వాళ ఇంతలా భ్రష్టుపట్టిపోవడానికి ఆ పార్టీనే ప్రధాన కారణం. గతంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా అనేక అడ్డదారులు తొక్కింది. రాష్టాల్రలో అధికారం నిలబెట్టుకోవడం కోసం లేదా అధికారంలో ఉన్న ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చడం కోసం కాంగ్రెస్ పార్టీ చేయని అరాచకం లేదు.ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపైకి ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి సంస్థలను ప్రయోగించి నానా ఇబ్బందులు పెట్టారు. సీబీఐ ద్వారా విచారణలు జరిపించారు. ఇప్పుడు కాంగ్రెస్ అడుగుజాడలలో అదే నరేంద్ర మోదీ, అవే ఏజెన్సీలను కాంగ్రెస్ నాయకుల విూదకు ప్రయోగిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో గానీ, ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేయడంలో గానీ కాంగ్రెస్ ఎప్పుడూ ముందుండేది. ఇప్పుడు అదే పంథాను బిజెపి అనుసరిస్తోంది. మొత్తంగా బిజెపి కాంగ్రెస్కన్నా భిన్నంగా ఉండలేకపోతోంది.