కాంగ్రెస్‌ పార్టీకి డీఎస్‌ గుడ్‌బై

2

– ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

– సీఎం కేసీఆర్‌తో భేటి

– సొనియా గాంధీకి రాజీనామా లేఖ

– టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటన

హైదరాబాద్‌,జూలై1(జనంసాక్షి):

కాంగ్రెస్‌కు డీఎస్‌ రాజీనామా

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన మూడు పేజీల రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు అధిష్ఠానం అప్పగించిన బాధ్యతలు మోశానని.. ఎన్నడూ పార్టీ క్రమశిక్షణ జవదాటలేదని దానిలో పేర్కొన్నారు. గత ఎన్నికల్లో పరాజయం తప్పదని తెలిసినా పోటీచేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటులో జాప్యం వల్ల పార్టీకి, వ్యక్తిగతంగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధికి వినియోగించాలని భావిస్తున్నానన్నారు.దానికి టీఆర్‌ఎస్‌ సరైన వేదికగా భావించి బాధాతప్త హృదయంతో కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు.కాగా అంతకు ముందు

కాంగ్రెస్‌ దిగ్గజం డి.శ్రీనివాస్‌ టిఆర్‌ఎస్‌లో చేరుతార్న ప్రచారంతో ఆయనను నిలువరించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ రంగంలోకి దిగింది. ఓ వైపు డిఎస్‌ వెళ్లి సిఎం కెసిఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలసిన వేళ, పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ సీనియర్లు నేరుగా డిఎస్‌ ఇంటికి వెళ్లారు. ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవడంతో వీరు ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ నిజామాబాద్‌ ఎంపి కవితతో కలసి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. మరోవైపు ఆయన ఉదయమే కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు ప్రచారం జోరందుకుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డీఎస్‌ కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరుతారనే వార్తలు దీంతో బలపడ్డాయి.  పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఘాటుగా లేఖ రాసినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో డీఎస్‌ మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లోనూ, నిర్ణయాల్లోనూ తనకు ప్రాధాన్యం తగ్గిందని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్న దశలో తనకు ఎమ్మెల్సీ దక్కక పోవడంతో ఆయన గుర్రుగా ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీని వీడి తెరాసలో చేరుతారనే వార్తలకు బలం చేకూరింది. కేసీఆర్‌తో డీఎస్‌ భేటీ కావడంతో తెరాసలో ఆయన చేరిక ఖరారైనట్లేనని అందరూ భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ను వీడే యోచనలో ఉన్న పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు బుజ్జగించే పనిలో పడ్డారు. ఆయనతో చర్చలు జరిపేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌, భట్టి విక్రమార్క, వీహెచ్‌, శ్రీధర్‌బాబు, డీకే అరుణ్‌ తదితరులు డీఎస్‌ నివాసానికి వెళ్లారు. నేతలు వచ్చే సమయానికి డీఎస్‌ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు కొద్ది సేపు ఎదురుచూసి వెనుదిరిగారు. అంతేగాకుండా ఫోన్‌లో సంప్రదిద్దామన్నా వారికి అందుబాటులోకి రాలేదు. పిసిసి మాజీ అద్యక్షుడు , మాజీ మంత్రి ,సీనియర్‌ కాంగ్రెస్‌ నేత డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ కు రాజీనామా చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ను కలవడానికి డి.శ్రీనివాస్‌ స్వయంగా సి.ఎమ్‌.క్యాంప్‌ ఆఫీస్‌ కు రావడంతో ఆయన టిఆర్‌ఎస్‌ లో చేరడం ఖరారైనట్లేనని భావిస్తున్నారు.గత కొంతకాలంగా డి.శ్రీనివాస్‌ కాంగ్రెస పై అసంతృప్తిగా ఉన్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా అదిష్టానం అవమానించిందని, ఆకుల లలితక టిక్కెట్‌ ఇచ్చినప్పుడు కనీసం చెప్పలేదని, దిగ్విజయ్‌ సింగ్‌ తనను అవమానించారని ఆయన భావిస్తున్నారు. దీనిపై ఆయన సోనియాగాంధీకి లేఖ కూడా రాశారని చెబుతున్నారు.కాగా డి.శ్రీనివాస్‌ ను బుజ్జగించడానికి తెలంగాణ కాంగ్రెస అద్యక్షుడు ఉత్తం కుమార్‌ రెడ్డి, వర్కింగ్‌ అద్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే డి.కె. అరుణ లు డి.ఎస్‌ .ఇంటికి వెళ్లారు. కాని శ్రీనివాస్‌ ఇంటిలో లేరని చెప్పడంతో వారు వెనుదిరిగారు. ఇదిలావుంటే డి. శ్రీనివాస్‌ బుధవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారన్న ప్రచారం జరిగింది. అనంతరం ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను క్యాంప్‌ కార్యాలయంలో కలుసుకున్నారు. డీఎస్‌ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్లుగా తెలియవచ్చింది. ఈ నెల 6న అందుకు ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంపై గతకొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో డీఎస్‌ ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్‌ చేయకపోవడం, జిల్లాకు సంబంధించి తన శిష్యురాలికి ఎమ్మెల్సీ టిక్కెట్‌ ఇస్తూ… ఆ సమాచారం తనకు తెలపకపోవడంపై కూడా కాంగ్రెస్‌పై… ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని భావించిన ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం కేసీఆర్‌ను డిఎస్‌ కలుసుకున్నారు.  అయితే తాను కేవలం సిఎం కెసిఆర్‌ను పలకరించడానికే వచ్చానని డిఎస్‌ తెలపడం కొసమెరుపు. కెసిఆర్‌ జ్వరంతో బాధపడుతున్నారని అందుకే ఆయనను కలిశానని చెప్పుకొచ్చారు. ఇక ఈ దశలో డిఎస్‌ను వారించినా లాభం లేదని కాంగ్రెస్‌లో కొందరు వ్యాఖ్యానించారు.