కార్పోరేట్‌కు దీటుగా విద్యారంగం వృద్ది చెందాలి

నిధులు వెచ్చించి స్కూళ్లను బలోపేతంచేయాలి
టీచర్ల రిక్రూట్‌మెంట్‌తో పరిపుష్టం చేయాలి
అమరావతి,సెప్టెంబర్‌4  జనం సాక్షి  : ప్రభుత్వ విద్యా రంగాన్ని కార్పొరేట్‌కు దీటుగా మారుస్తామని, పాఠశాలల ముఖ చిత్రాన్ని మార్చి వేస్తామని ప్రకటించింది. సూచనల కోసం ఒక నిపుణుల కమిటీని వేశారు.  ప్రైవేటు సంస్థల నియంత్రణకు రెండు కమిషన్లు నియమించారు. ’నాడు`నేడు’ మొదలైంది. గొప్ప విద్యావేత్తలను, పరిపాలనా దక్షులను వివిధ కమిటీల్లోకి ఆహ్వానించారు. జగన్‌ ప్రభుత్వం కొలువు తీరగానే గతంలో ఎప్పుడూ లేనట్టు విద్యారంగ సంస్కరణల కోసం కసరత్తు ప్రారంభించింది. ’అమ్మ ఒడి’ ప్రకటనతో ఇది మొదలైంది. తరచూ స్వయంగా ముఖ్యమంత్రి సవిూక్షలు చేసి, దిశా నిర్దేశం చేస్తున్నారు. నిజానికి
మన పాఠశాలలు కనీస వసతుల్లేవు. మన ప్రమాణాలు నానాటికి తీసికట్టుగా మారుతున్నాయి. గ్రావిూణులు,
పేదలు, కింది వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నారు. మధ్యతరగతికి సైతం చదువు భారంగా మారింది. ఊహించలేనంత అసమానతలు ఒకటో తరగతి నుంచే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం చేపడుతున్న పథకాలు, సంస్కరణలు ఈ సమస్యల నుంచి మన పాఠశాల విద్యారంగాన్ని గట్టెక్కించగలిగితే అంతకు మించి ఆశయం మరోటి ఉండదు.  పిల్లల చదువులు భారమైనందు వల్ల మన అక్షరాస్యత తక్కువగా
వుందని, ప్రైవేటు చదువు మరీ భారంగా వుందని ఈ పథకాన్ని తెచ్చామంటుంది ప్రభుత్వం. సమస్యకు మూల కారణం ఊళ్లో బడి దివాళా తీయడం. కనీస వసతులు, చదువులు లేక ప్రజల్నించి దూరం గావడం. నిరుపేదలు కూడా ప్రైవేటును ఆశ్రయించడం. అమ్మ ఒడికి రూ.6,300 కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం, అదే సొమ్ముతో మన పాఠశాలల్ని చూడముచ్చటగా మార్చి వుంటే అద్భుతాలు జరిగేవి. రెండు మూడేళ్లలో వీటి రూపురేఖలే మారి పొయ్యేవి. మంచి చదువు పేద పిల్లలకూ దక్కేది. ఆ ఊరి పిల్లలు ఆ ఊరి బడి లోనే చదివే స్థితి వుంటే మన విద్యారంగం ఎలా వుంటుందో ఒకసారి ఊహించుకొంటే ఇది తెలిసొస్తుంది. ప్రభుత్వ బడిని మార్చకుండా తల్లి దండ్రులకు నగదు ఇవ్వడం వల్ల మార్పు వస్తుందనుకోవడం పొరపాటే. విమర్శలు వచ్చే సరికి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తామని ’నాడు`నేడు’ పథకం తెచ్చారు. నలభై వేల పై చిలుకు స్కూళ్ల నుంచి 15 వేల స్కూళ్లను ఎంపిక చేసి వీటికి తొమ్మిది రకాల వసతులు కల్పిస్తామని ఉత్తర్వు లిచ్చారు. నిర్బంధంగా ప్రస్తుతం తెలుగు విూడియంలో వున్న పాతిక లక్షల మందిని ఇంగ్లీషు విూడియంలోకి మారి తీరాలనడంగా ఉంది. నిపుణుల కమిటీలన్నీ ప్రాథమిక విద్య వరకైనా మాతృభాషా విూడియం వుండి తీరాలంటున్నాయి. నూతన విద్యా విధానం కూడా ఇదే చెబుతోంది. ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా ఇదే పేర్కొంది. కేంబ్రిడ్జి, అజీం ప్రేంజీ ఫౌండేషన్లు చేసిన పరిశీలనల్లో ఇంగ్లీషు మాధ్యమం తీవ్ర నష్టం తెచ్చిందని తేలింది. ఆంగ్ల మాధ్యమాన్ని మొండిగా ఎవ్వరూ వ్యతిరేకించడం లేదు. మొదట మాతృభాషలో ప్రారంభించి ఒకానొక దశలో ఆంగ్లంలోకి మళ్లించాలని మాత్రమే చెబుతున్నారు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో జరుగుతున్నదీ ఇదే! ఇంగ్లీషు విూడియం పెడితే మంచి చదువు చెప్పేసినట్లు అవుతుందనుకొంటుంది ప్రభుత్వం. ప్రస్తుత టీచర్లు దీనికెంత అర్హులన్న ప్రశ్న కూడా వుంది.
పిల్లల చదువుల్ని మూల్యాంకనం చేసి, క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, మారుతున్న అవసరాలకు తగ్గ పాఠ్యాంశాలు రూపొందించి, శిక్షణలిచ్చి ఎప్పటికప్పుడు సృజనాత్మకంగా బోధనాభ్యసనాలు సాగేలా చూసే బాధ్యత ఎస్‌.సి.ఆర్‌.టి వారిది. జిల్లా విద్యా శిక్షణా సంస్థలది. ఉమ్మడి సర్వీసు నిబంధనల సాకుతో అన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి.  ఒక స్పష్టమైన దృక్పథం వుంటే మొదట దీనిపైన దృష్టి సారించాల్సి వుంటుంది. అన్ని స్థాయిల్లో బలమైన వ్యవస్థల్ని నిర్మించాల్సి వుంటుంది. వ్యవస్థలోని మరో బలహీనత ప్రజల్ని ఏ మాత్రం భాగస్వాముల్ని చెయ్యలేకపోవడం. బడిని ఒంటరిగా మార్చడం. పంచాయతీలకు, స్థానిక దాతలకు స్థానం లేకుండా పోవడం.  నాడు`నేడు నిధుల్ని పాఠశాల విద్యా కమిటీలే వ్యయం చేసేలా ఉత్తర్వులిచ్చారు. ఉన్నత పాఠశాలల్ని గుర్తించి, అన్ని హంగులు కల్పించాలి. బలమైన అకడమిక్‌ వ్యవస్థను రూపొందించాలి. అధ్యాపకుల్ని నియమించి ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల ప్రారంభించి దీనికి పూనుకోవాలి. ప్రస్తుత జూనియర్‌ కళాశాలల్ని, అందులోని రెగ్యులర్‌, కాంట్రాక్టు అధ్యాపకుల్ని ఎలా సర్దుబాటు చెయ్యాలో కూడా చర్చించాలి. మన ప్రాథమిక పాఠశాలలు కనీస వసతుల్లేని, ఒకటి రెండు గదుల్లో నడుస్తున్నాయి. వాటిలోకి పసి బిడ్డల్ని తేవడం వారికి రక్షణ కల్పించడం అంత సులవైనపనిగాదు.