కాశ్మీర్‌పై తిలాపాపం తలాపడికెడు

శాంతికి విఘాతంకలిగించిన గత పాలకులు
అందుకే 370 రద్దుకు తప్పని  చర్యలు
న్యూఢిల్లీ,ఆగస్ట్‌6  (జనం సాక్షి) : కాశ్మీర్‌లో సంకీర్ణ సర్కార్‌ ద్వారా శాంతిని నెలకొల్పాలని బిజెపి గతంలో చేసిన ప్రయత్నాలకు ఓ రకంగా మెహబూబా ముఫ్తీ తూట్లు పొడిచారనే చెప్పాలి. అంతకుముందు  అబ్దుల్లాల కాలంలోనూ వారు కాశ్మీర్‌లో శాంతి చర్యలకు పూనుకోలేదు. దీంతో ఉగ్రమూకలు దీనిని అలసుగా తీసుకుని స్థానికంగా తిష్టవేశారు. ముఫ్తీ కాలంలో సైనిక చర్యను అడ్డుకుంటూ ఆమె సైన్యంపైనే కేసులు పెట్టించారు. ఇదో రకంగా ఉగ్రవాదులకు ఊతంగా మారింది. అక్కడ ఉగ్రవాదులను ఏరివేయాలన్న సంకల్పాన్ని దెబ్బతీసారు. కాశ్మీర్‌ అభివృద్దికి వేలకోట్ల రూపాయను కేటాయించినా, అక్కడ యువత పాక్‌ ఉగ్రవాద ఉచ్చులో ఇరుక్కుంటూ భవిష్యత్‌ను సర్వనాశనం చేసుకుంటోంది. తొలిదశలో స్వాతంత్య్రా నంతరం నెహ్రూ అవలంబించిన విధానాల కారణంగా అక్కడ ఉగ్రమూకలు తిష్టవేసి హిందువులను ఊచకోత కోశాయి. లక్షలాది కుటుంబాలను తన్ని తరిమేశాయి. అక్కడే ఉండాలనుకున్న వారిని బలవంతంగా మతం మార్చారు. కాశ్మీర్‌ పండిట్లను ఊచకోతకోసి,మతం మార్చి నానాహింసలు పెట్టిన ఘటనలు కోకొల్లలు. ఇన్ని ఘోరాలు జరిగినా ఏనాడు పట్టించుకోని ప్రభుత్వాలు రాజ్యం ఏలాయి.  ఓ పత్రికా సంపాదకుడిని, సైనికుడిని హత్య చేయడం చూస్తే ప్రభుత్వం నిర్తిప్తంగా ఉందనే గమనించాలి. పాక్‌ అనుకూలతను జీర్ణించుకున్న మెహబూబా ముఫ్తీ పరోక్షంగా ఉగ్రవాదుల చర్యలు సమర్థిస్తూ వచ్చారు. అక్కడ వారి ఏరివేతను కర్రపెత్తనంగా చెప్పుకొచ్చారు. మొత్తంగా వ్యవహారం చేయిదాటడంతో చేసేది లేక బిజెపి ప్రభుత్వం నుంచి బయటపడడం, గవర్నర్‌ పాలన విధించడం,370 అధికరణను రద్దు చేయడం వంటి చర్యలు అనివార్యంగా మారాయి. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కశ్మీర్‌ విధానంపై విమర్శలు చేస్తున్న గులాం నబీ ఆజాద్‌, లెఫ్ట్‌ పార్టీలు, కాంగ్రెస్‌ తదితర పార్టీలు ఇంతకాలం రావణకాష్టం రగిల్చిన విషయాన్ని మర్చి పోరాదు. కశ్మీర్‌ సమస్య ఈనాటిది కాదని, ఎప్పటి నుంచో ఉందని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కశ్మీర్‌లోయలో శాంతి, అభివృద్ధికి భాజపా చేసినంతగా గతంలో ఏ ప్రభుత్వం కూడా చేసి ఉండదు.   పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదం అక్కడ అశాంతిని రాజేస్తోంది. కాల్పుల విరమణ నిర్ణయం తీసుకుంటే దానిని కూడా పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి చొరబడే
ఉగ్రవాదులను మట్టుబెట్టకుండా భద్రతా బలగాలను ఎప్పుడూ విశ్రమించలేదు. తీవ్రవాద నిరోధంపై పాకిస్థాన్‌ సుముఖంగా ఉంటే ఆ దేశంతోనూ మాట్లాడతామని భారత్‌ పదేపదే చెబుతూనే ఉంది. అయితే తొలుత ఆ దేశం తన గడ్డపై నుంచి వస్తున్న ఉగ్రవాద సమస్యను పరిష్కరించాల్సి ఉంది. కాశ్మీర్‌ భారత దేశానికి మణి మకుటం లాంటిది.  అలాంటి రాష్ట్రం తీవ్రవాద  సమస్యల్లో చిక్కుకోవడం దేశానికి ఎప్పటికీ మంచిది కాదు. బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కావాలనే తీవ్రావాద శక్తుల విజృంభించి కాశ్మీర్‌లోయను రక్తమోడేలా నిరంతరం శ్రమిస్తూ వచ్చాయి. 370 రద్దును కేందప్రభుత్వం ప్రకటించగానే పరిస్థితి మెరుగుపడుతుందని, తుపాకుల మోత ఆగిపోతుందని ఆశించలేం. అందుకు ఎంతో కసరత్తు చేయాల్సిఉంది. ఇంతకాలం ఉగ్రవాద ప్రేరేపిత మత ఛాందసులు మరింతగా సమస్యను ఎగదోశారు. కాశ్మీర్‌ అగ్నిగుండంగా మారేలా చేశారు. మతం పేరుతో అక్కడ హింసను రాజేస్తున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ మాసంలో ఇద్దరు కీలక వ్యక్తులను పొట్టన పెట్టుకున్నారు. తుపాకీ నీడలో బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి ఏర్పడడానికి పాక్‌ గడ్డవిూది నుంచి ఉగ్రవాదులను తయారు చేసి ఎగదోయడమే కారణమని వేరుగా చెప్పక్కరలేదు.  కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలతో శాంతికి అవకాశం ఏర్పడినప్పుడల్లా పాక్‌ రంగప్రవేశం చేస్తోంది. మోడీ ప్రభుత్వం అనుసరించిన ఉగ్రవాద ఏరివేత విధానాల మూలంగా సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న పాక్‌ నేరుగా  పౌరులు, భద్రతా జవాన్లపై కాల్పులు జరుపుతూ వస్తోంది. దీంతో మనవైపు నుంచి ఎక్కువగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. కాశ్మీర్‌లో నిరసనలు, వేర్పాటువాదుల డిమాండ్లు పాక్‌ ప్రేరేపితమైనవేనని వేరుగా చెప్పాల్సిన పనిలేదు. రెండు వైపులా ఉన్న వేర్పాటువాద, మత ఛాందసవాద సంస్థలు ఘర్షణలను రెచ్చగొట్టి కాశ్మీర్‌ను రావణ కాష్టంలా మార్చుతున్నాయి. సర్జికల్‌ దాడులతో సీమాంతర ఉగ్రవాదం పీచమణిచి వేయడంతో తట్టుకోలేని పాక్‌ కొద్ది రోజులకే బిఎస్‌ఎఫ్‌ క్యాంపుపైన, అటు పిమ్మట సంజ్వాన్‌ ఆర్మీ క్యాంపు, జమ్మూలోని సిఆర్‌పిఎఫ్‌ క్యాంపులపైనా ఉగ్రవాద దాడులు చేయించింది. పాకిస్తాన్‌తో చర్చల్లేవు అని మోడీ ప్రభుత్వం ఖరాఖండిగా ప్రకటించిన తరువాతనే కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు పెరిగాయి. కాశ్మీర్‌ను అడ్డుపెట్టుకుని కేవలం శాంతి భద్రతల సమస్యగా మార్చాలని పాక్‌ కుట్రలు పన్నుతూనే ఉంది. కాశ్మీరీయుల స్వయంప్రతిపత్తికి భరోసా పేరుతో అక్కడ కల్పించిన ఆర్టికల్‌ 370 ఇప్పుడు దేశానికి గుదిబండగా మారడంతో ఇక కేంద్రం దానిని రద్దుచేసేందుకు నిర్ణయించక తప్పలేదు.  పాక్‌తో చర్చలకు సిద్దంగా ఉన్నా నిజాయితీ లేని, నిలకడలేని పాక్‌ నాయకత్వం ఎప్పటికప్పుడు ఉగ్రవాదులకు దాసోహం అంటోంది. కాశ్మీర్‌ విషయంలో దేశంలోని రాజకీయా పార్టీలది వింతవైఖరిగా ఉంది. దేశంలో పాక్‌ చిచ్చు పెడుతుంటే మోడీ ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా చలికాచుకునే యత్నాలు చేస్తున్నాయి. ఇది ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదు.