కాశ్మీర్‌లో తప్పిన పెనుముప్పు

ఐఇడి బాంబును పట్టుకున్న భద్రతాబలగాలు

శ్రీనగర్‌,నవంబర్‌21 (జనం సాక్షి) : జమ్మూ – శ్రీనగర్‌ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం భద్రతా బలగాలు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా.. అనంత్‌నాగ్‌ జిల్లాలోని వాన్ఫూ వద్ద ఐఈడీ బాంబు లభ్యమైంది. దీంతో బాంబు స్కాడ్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆ బాంబును నిర్వీర్యం చేశారు. రహదారిపై ఐఈడీ బాంబు లభ్యం కావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను మళ్లించారు. భారత బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జాతీయ రహదారిపై ఐఈడీ అమర్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జమ్మూ – శ్రీనగర్‌ జాతీయ రహదారిపై పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్మూ – ఫూంచ్‌ హైవేపై మంగళవారం ఐఈడీ బాంబును నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే.