కిడ్నాపైన బాలుడు జషిత్‌ కోసం ముమ్మర గాలింపు

బృందాలుగా రంగంలోకి దిగిన పోలీసులు
కాకినాడ,జులై24(జ‌నంసాక్షి):  కిడ్నాపైన బాలుడి ఇంకా లభించలేదు. బాలుడుని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్‌ బృందదాలు గాలిస్తున్నాయి. కిడ్నాపర్లు ఎవరన్నది కూడా అంతుచిక్కడం లేదు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలోని విజయలక్ష్మీనగర్‌లో సోమవారం రాత్రి అపహరణకు గురైన చిన్నారి జషిత్‌(4) ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.  కిడ్నాపర్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. తమ చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ బిడ్డ వీలైనంత త్వరగా తమ చెంతకు చేరాలని దేవుడిని వేడుకుంటున్నారు. మరోవైపు ఆచూకీ కోసం ఇప్పటికే పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రతిరోజూ సాయంత్రం జషిత్‌ తమ ఇంటి వద్ద ఆడుకుంటాడని స్థానిక ఇంటి యజమాని తెలిపారు. అయితే ఈ నెల 3వ తేదిన జషిత్‌ ఆడుకుంటున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి ముసుగులు వేసుకుని తమ ఇంటికి వచ్చారని, ఇల్లు ఏమైనా ఖాళీ ఉందా అని అడిగి ఫోన్‌ నంబర్‌ తీసుకువెళ్లారని పోలీసులకు తెలిపారు. దీంతో 3వ తేది నాటి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, ఆ వ్యక్తులే చిన్నారిని కిడ్నాప్‌ చేసి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే జషిత్‌ కిడ్నాప్‌ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని పోలీసులు అభిప్రాయ
పడుతున్నారు. కిడ్నాప్‌ వెనక ఎలాంటి ప్రణాళిక ఉందో ఆధారాలు సేకరిస్తున్నారు. అలాగే కిడ్నాప్‌ చేసిన వారు ఇంతవరకు ఎలాంటి డిమాండ్‌ ముందుకు తీసుకుని రాలేదు.