కీలక వడ్డీ రేట్లు అరశాతం తగ్గించిన ఆర్‌బీఐ

268
హైదరాబాద్‌: నాలుగో ద్వైమాసిక ద్రవ్యపరపతి, విధాన సమీక్షను ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ వెల్లడించారు. ముంబయిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘురామ్‌ రాజన్‌ మాట్లాడుతూ.. కీలక వడ్డీరేట్లను అరశాతం మేర తగ్గించినట్లు ప్రకటించారు. రెపోరేటును 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన ఆర్‌బీఐ నగదు నిల్వల నిష్పత్తి యథాతథంగా ఉంటుందని ప్రకటించింది. దీంతో రెపో రేటు నాలుగేళ్ల కనిష్ఠస్థాయి 6.75శాతానికి చేరింది. వడ్డీరేట్లు తగ్గడం వల్ల గృహరుణాల ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదముందని, 2016 జనవరి నాటికి ద్రవ్యోల్బణం 5.8 శాతం ఉటుందని ఆర్‌బీఐ అంచనా వేస్తున్నట్లు రాజన్‌ చెప్పారు. 2015-16లో వృద్ధిరేటు అంచనాను 7.6శాతం నుంచి 7.4శాతానికి తగ్గించినట్లు పేర్కొన్నారు. 2018 మార్చి నాటికి ప్రభుత్వ బాండ్లలో ఎఫ్‌సీఐ పెట్టుబడి పరిమితిని దశలవారీగా 5 శాతానికి పెంచుతామని రాజన్‌ వెల్లడించారు.