కెసిఆర్‌ వల్ల మాత్రమే గ్రామాల అభివృద్ది

ఎన్నికల్లో మరోమారు నిరూపించిన ప్రజలు

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌,కొప్పుల ఈశ్వర్‌

జగిత్యాల,జనవరి31(జ‌నంసాక్షి): దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని,అభివృద్దినే తాము కోరుకుంటున్నామని ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు నిరూపించారని జగిత్యాల,ధర్మపురి ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, కొప్పుల ఈశ్వర్‌లు అన్నారు. ప్రజలు తమ గ్రామాలు కెసిఆర్‌ వల్ల మాత్రమే అభివృద్ది కాగలవని నమ్మి టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపించారని అన్నారు. జగిత్యాల ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా సరంపంచ్‌లు ఉంటారన్నారు. గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరడం, గ్రామాలను ఏకగ్రీవం చేయడం, సర్పంచ్‌లను గెలపించడం జరిగిందని డాక్టర్‌ సంజయ్‌ అన్నారు. ఇది గ్రామాల అభివృద్దికి దోహదపడే చర్యని అన్నారు. ఎంపీ కవిత జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తున్నారనీ, రూ.1200కోట్లతో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి చేశామన్నారు. ప్రతిపక్ష శాసన సభ్యులు ఉన్న అభివృద్ధి చేయడంలో వివక్ష చూపలేదన్నారు. జగిత్యాల పట్టణానికి 4100 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల మంజూరు, రూ.50కోట్లతో జగిత్యాల పట్టణ అభివృద్ధికి రూ.3కోట్లతో చింతకుంట మినీ ట్యాంక్‌ నిర్మించామన్నారు. ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాల అ భివృద్దికి పాటుపడాలని కొప్పులు ఈశ్వర్‌ అన్నారు. సర్పంచులు, వార్డు సభ్యులు ఇందుకోసం కష్టపడి పనిచేయాలన్నారు. అప్పుడే ఈ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.