కేంద్రంలో ఝటా సర్కార్
– బీహార్ ఎన్నికల సభలో సోనియా ధ్వజం
భాగల్పూర్, అక్టోబర్3(జనంసాక్షి): కేంద్రంలో మోదీ సర్కార్ ఝూటా సర్కార్ అని ఒక్క వాగ్ధానాన్ని కూడా నెరవేర్చలేదని , సమాజాన్ని విభజించేవారికి ఓట్లు వెయ్యెద్దని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. బీహార్లో ఎన్నికల ప్రచారానికి ఆమె శ్రీకారం చుట్టారు. కహల్గావ్లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీపై సోనియా మండిపడ్డారు. ప్యాకేజీ ప్రకటనల విషయంలో మహా తెలివైనవారని ఎద్దేవా చేశారు. 15 నెలల మోదీ పాలనతో దేశం ప్రమాదంలో పడిందన్నారు. విదేశాలు తిరగడం తప్ప చేసిందేవిూ లేదని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ఆదేశంతో రిజర్వేషన్లలో కోటా తీసుకురావాలని బీజేపీ యోచిస్తోందని విమర్శించారు. తప్పుడు వాగ్దానాలు చేసే వారిని తరిమికొట్టాలని సోనియా పిలుపునిచ్చారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ను పొగడ్తలతో ముంచెత్తారు. క్లీన్ ఇమేజ్ కలిగిన సామర్థవంతమైన ముఖ్యమంత్రి అని సోనియా గాంధీ కొనియాడారు.