కేజీ టూ పీజీ అమలు చేయండి
– ఫీజుల దోపిడీ నివారించండి
– అనుమతి లేని విద్యా సంస్థలను రద్దుచేయండి
– రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళన
హైదరాబాద్,జూన్27(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయిహైదరాబాద్లో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యా లయం ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి.కేజీ టూ పీజీ ఉచిత విద్య ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజలు తగ్గించాలని, అనుమతుల్లేని పాఠశాలలు రద్దు చేయాలని విద్యార్థులు డి మాండ్ చేశారు. కార్పోరేట్ కాలేజీల, స్కూళ్ల దోపిడీని అరికట్టలేకపోయిం దన్నారు. సర్కార్ కార్పోరేట్లకు వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు. వెంట నే వాటిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు క్యాంప్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. సిఎంకు వ్య తిరేకంగా నినాదాలు చేశారు. దీంతో విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. విద్యార్థుల ధర్నాతో ఇక్కడ భారీగా పోలీసులను మొహరించారు. ఇదిలావుంటే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్లో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటిని ముట్టడించేందకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలని, విద్యాహక్కు చట్టం అమలు చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులు నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఖమ్మం కలెక్టరేట్ను ముట్టడించాయి. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. విద్యారంగ సమస్యలపై వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో
మహబూబ్నగర్ లో శనివారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, టీవీవీ విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఖమ్మం కలెక్టరేట్ను ముట్టడించాయి. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులకు వ్యతిరేకంగా శనివారం సంగారెడ్డి లోని మెదక్ కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. వందలాదిగా తరలివచ్చిన విద్యార్థులంతా పాల్గొని ప్రైవేట్ విద్యా దోపిడీని అరికట్టాలని నినాదాలు చేవారు. ప్రభుత్వం కార్పోరేట్ కాలేజీల దోపిడీపై చర్య తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి డిమాండ్ చేవారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలుచేస్తూ తల్లిదండ్రులను వేధిస్తున్నాయన్నారు.
పభుత్వం విద్యాహక్కు చట్టం అమలు చేసి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని విద్యార్థి సంఘాలు డిమాండు చేశాయి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండు చేస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేటు పాఠశాలలో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యను ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండు చేశారు. అనంతరం పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.