కేసీఆర్‌ ఫ్రంట్‌ రెండు రోజుల ముచ్చటే – కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య


                                                          – తన తప్పిదాలు కప్పి పుచ్చుకోవటానికే కేసీఆర్‌ నాటకం

– కాంగ్రెసేతర ఫ్రంట్‌ అసాధ్యం

– కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30(జ‌నం సాక్షి ) : తన తప్పిదాలు కప్పి పుచ్చుకోవడానికే కేసీఆర్‌ థర్డ్‌ఫ్రంట్‌కు పూనుకున్నారని, ఈ ఫ్రంట్‌ రెండురోజుల ముచ్చటేనని కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఫ్రంట్‌ అసాధ్యమన్నారు. కాంగ్రెసేతర ఫ్రంట్‌ అసాధ్యమని సీపీఎం, డీఎంకే, బీజేడీ ఎప్పుడో చెప్పాయన్నారు. కేసీఆర్‌ మూడో ఫ్రంట్‌ రెండు రోజుల ముచ్చటే అని పొన్నాల ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ సీబీఐ కేసుల్లో ఉన్నారని… కేసీఆర్‌ జుట్టు మోదీ చేతుల్లో ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామని చెబుతున్న కేసీఆర్‌ ఆ మేరకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. కేవలం మాటల్లోనే కోటలు కడుతూ ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని విమర్శించారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, తెరాస నేతలు వీటిల్లో అక్రమాలకు పాల్పడి కోట్లు దండుకున్నారని ఆరోపించారు. దమ్ముంటే మిషన్‌ కాకతీయ, భగీరథపై విచారణ జరిపించాలని పొన్నాల సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో పేద వర్గాల అభ్యున్నతికి కేసీఆర్‌ చేస్తుందేవిూ లేదన్నారు. సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేస్తామని కొంతమందికే పంపిణీ చేసి చేతులెత్తేస్తున్నారన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లలోనూ అర్హులకు అన్యాయం జరుగుతుందని కేవలం తెరాస పార్టీకి చెందిన కార్యకర్తలకు మాత్రమే వీటిని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గ్రామంలో పదుల సంఖ్యలో ఇండ్లు లేని పేదలుంటే ఒకరికిద్దరికి మాత్రమే ఇండ్లు కట్టించి అందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇచ్చామని ప్రబుత్వం చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైన కేసీఆర్‌ తనతీరును మార్చుకొని ప్రజా సంక్షేమ పాలన సాగించాలని సూచించారు. లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

—————–