కేసులతో సంబందం ఉన్న వాహనాలకు వేలం

వచ్చే నెల 4ననిర్వహిస్తాం: సిఐ

భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌25 (జనంసాక్షి) : వివిధ కేసులతో సంభందం ఉండి పోలీసుల ఆధీనంలో ఉన్న 47 ద్విచక్ర వాహనాలకు మరియు 10 ఆటోలకు డిసెంబర్‌ 4వ తేదీన వేలంపాట నిర్వహించనున్నట్లు కొత్తగూడెం 3టౌన్‌ సిఐ ఆదినారాయణ తెలియజేసారు. జిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌ ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పీ ఎస్‌.ఎం అలీ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కొత్తగూడెం 3టౌన్‌పోలీస్‌ స్టేషన్లోని వివిధ కేసులలో ఉన్న వాహనాల యజమానులకు రిజిస్టర్‌ పోస్టుల ద్వారా సమాచారం అందించడం జరిగిందని తెలిపారు. వాహన యజమానులు ఎవరూ కూడా తిరిగి తమ వాహనాల గురించి స్పందించకపోవడంతో మోటార్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్‌ ద్వారా అట్టి వాహనాల కండీషన్ను బట్టి వాటికి ధరలను నిర్ణయించడం జరిగిందని తెలిపారు. పోలీసు స్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు గాను ఈ పక్రియను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపట్టడం జరిగిందని తెలిపారు. స్వాధీనంలో ఉన్న వాహనాలకు డిసెంబర్‌ 4వ తేదీన ఉదయం 10గంటలకు ఓల్డ్‌ డిపో ఎదురుగా ఉన్న దుర్గా కళామందిర్‌ థియేటర్‌ ప్రక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో ఈ వేలంపాట కార్యక్రమం నిర్వహించనున్నామని సిఐ తెలియజేసారు.వేలంపాటలో పాల్గొనడానికి ఆసక్తిగలవారు కొత్తగూడెం 3టౌన్‌ పోలీసులను సంప్రదించాలని అన్నారు.