కొత్త వెయ్యి నోట్లు రావు
రద్దయిన వెయ్యి నోట్ల స్థానంలో ప్రస్తుతానికైతే కొత్తవి ప్రవేశపెట్టే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. నోట్ల రద్దు అంశంపై ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. గురువారం 22500 ఏటీఎంలను కొత్త నోట్లకు అనుగుణంగా మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక రోజువారీ నోట్ల మార్పిడి పరిమితి తగ్గింపుపై స్పందిస్తూ.. నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికే రోజువారీ పరిమితిని రూ.4500 నుంచి రెండు వేలకు తగ్గించినట్లు జైట్లీ తెలిపారు. ఈ తగ్గించిన పరిమితి రేపటి నుంచి అమల్లోకి వస్తుందని గురువారం ఉదయం ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంతదాస్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ పరిమితిని భారీగా తగ్గించినా.. రైతులు, పెళ్లిళ్లు ఉన్నవారికి మాత్రం నిబంధనలను సడలించారు. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉన్న రైతులు వారానికి రూ.50 వేలు విత్డ్రా చేసుకొనే వీలుండగా.. పెళ్లిళ్లు చేసుకొనే వారు గరిష్ఠంగా రూ.2.5 లక్షల వరకు తీసుకునే అవకాశం కల్పించారు.