కొవ్వాడ అణు విద్యుత్‌ను వ్యతిరేకించాలి

అన్ని రాజకీయ పార్టీలు తమ విధానం ప్రకటించాలి
విశాఖపట్టణం,మార్చి27(జ‌నంసాక్షి): కొవ్వాడలో అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు ముప్పువాటిల్లుతుందని సిఐటియు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్‌ఇన అన్ని పార్టీలు తమ ఎజెండాలో పెట్టి ప్రజలకు వివరించాలని అన్నారు.  కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు మానాలన్నారు. అప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు దీన్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు. అభివృద్ది చెందిన దేశాలన్నీ అణువిద్యుత్‌ కేంద్రాలను వ్యతిరేకిస్తున్న విషయాన్ని గమనించాలని అన్నారు. జపాన్‌లో జరిగిన న్యూక్లియర్‌ పవర్‌ ప్రాజెక్టు ప్రమాదానికి ఆ దేశం రూ. లక్షా 50వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇంకా దాని రేడియేషన్‌ ప్రభావం ఆ దేశంలో ఉందని తెలిపారు. అలాంటి ప్రమాదాన్ని ఉత్తరాంధ్రపై తెచ్చి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటు గురించి మాట్లాడని చంద్రబాబు ఆ ప్రాంతాల ప్రమాద జోన్‌లను గుర్తించడానికి జీవోలను విడుదల చేస్తుందన్నారు. ఇది ఒక్క కొవ్వాడకు సంబంధించిన ప్రమాదం కాదన్న విషయాన్ని అన్ని పార్టీలు  గ్రహించాలన్నారు. అభివృద్ధి చేయాలంటే పరిశ్రమలను, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి గాని, ఇలా ప్రమాద కుంపట్లు కాదన్నారు. దీన్ని అడ్డుకోవడం ఒక్కటే మార్గమని, దాని కోసం ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. కొవ్వాడలో ప్రమాదం జరిగితే 177 కిలోవిూటర్ల దూరం వరకూ సర్వ నాశనం అవుతుందని అన్నారు. అందకే తాము ముందునుంచి దీనిని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. దీని ప్రమాదం వలన జీవ కణంపై ప్రభావం పడి, కొన్ని తరాల వరకూ ఉంటుందని హెచ్చరించారు. ఆ ప్రాంతంలో గడ్డి కూడా మొలవదన్నారు. ఇంత తీవ్రమైన పర్యవశానాలను కొన్ని తెచ్చుకోవడం ఎందుకని ప్రశ్నించారు. దీనిపై రాజకీయ పార్టీలు స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.