కోరినప్పుడే సెలవులిస్తాం : దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 6 : సమస్యలు పరిష్కరిస్తామని డీజీపీ దినేష్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో కొండాపూర్‌లోని 8వ బెటాలియన్‌ పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు రెండు రోజులుగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాన్ని సోమవారంనాడు విరమించారు. డీజీపీ దినేష్‌రెడ్డితో సోమవారంనాడు జరిగిన చర్చల్లో కొందరు పోలీసుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు చెప్పారు. ఆందోళనలో పాల్గొన్న ఎవరిపైనా చర్యలు తీసుకోబోమని స్ఫష్టం చేశారు. ఇక నుంచి ప్రతి నెలా పోలీసుల కుటుంబ సభ్యులతో భేటీ అవుతామని చెప్పారు. మరోసారి దూర ప్రాంతాలకు పంపబోమని తెలిపారు. ఆర్డర్లీ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నామని చెప్పారు. అవసరమైనప్పుడల్లా సెలవులు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. ఇదిలా ఉండగా రెండు రోజులుగా కొండాపూర్‌లో కొనసాగుతున్న బెటాలియన్‌ కుటుంబ సభ్యుల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో 12 బెటాలియన్ల పరిధిలో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు నిరసనలు, ధర్నాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే డీజీపీ హామీతో వారు తమ ఆందోళనను విరమించారు.
.