కోర్టులో లొంగిపోయిన లాలూ

– పెరోల్‌ పొడిగింపును తిరస్కరించిన కోర్టు
పాట్నా, ఆగస్టు30(జ‌నం సాక్షి) : బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గురువారం కోర్టు ఎదుట లొంగిపోయారు. ఈ ఏడాది మే నుంచి లాలూ పెరోల్‌పై ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ పెరోల్‌ పొడిగింపు కోసం చేసుకున్న దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. దీంతో లాలూ కోర్టులో లొంగిపోయారు.  తాను కోర్టు ఆదేశాలను అనుసరిస్తాను.. నాకు ఆరోగ్య బాలేదు.. కానీ హైకోర్టు తీర్పు పట్ల విశ్వాసం ఉంది అని లాలూ పేర్కొన్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూకు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. 70ఏళ్ల లాలూ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో మూడు నెలల పాటు పెరోల్‌ పొడిగించాలని ఝార్ఖండ్‌ హైకోర్టును కోరారు. కానీ కోర్టు అందుకు నిరాకరించింది. ఆగస్టు
30వ తేదీన తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. లాలూకు కావాల్సిన వైద్య సహాయాన్ని జైలులోనే అందించాలని కోర్టు ప్రభుత్వానికి వెల్లడించింది. విచారణ సమయంలో పెరోల్‌ పొడిగింపును సీబీఐ వ్యతిరేకించింది. ఇప్పటికే ఆయన మూడు నెలల పెరోల్‌ తీసుకున్నారని, చికిత్స కూడా చేయించుకున్నారని తెలిపింది. ఝార్ఖండ్‌ హైకోర్టు మే నెలలో లాలూకు వైద్య చికిత్స నిమిత్తం ఆరువారాల పెరోల్‌ ఇచ్చింది. ఈ పెరోల్‌ సమయంలో బహిరంగ కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు, విూడియా సమావేశాల్లో పాల్గొనేందుకు వీల్లేదని కోర్టు తెలిపింది.