కోలుకుంటున్న విందు బాధితులు 

నిర్మల్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): నిర్మల్‌ జిల్లా భైంసాలో ఓ వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకోగా అస్వస్థత పాలయిన వారు కోలుకుంటున్నారు. వీరు చికిత్స పొందుతున్నారు.  పట్టణంలోని డీసెంట్‌ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన వివాహ వేడుకలో ఏర్పాటుచేసిన విందు వికటించి సుమారు 500 మంది అస్వస్థతకు గురయ్యారు. విందులో వడ్డించిన పాయసం తినడం వల్లే వారంతా అస్వస్థతకు గురైనట్టు స్థానికులు చెబుతున్నారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న బాధితులను చికిత్స నిమిత్తం భైంసా ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. తొలుత పదుల సంఖ్యలోనే అస్వస్థతకు గురైనప్పటికీ.. క్రమంగా వారి సంఖ్య వందల సంఖ్యకు చేరుకోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. వైద్య సిబ్బంది బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. అస్వస్థతకు గురైనవారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్టు సమాచారం. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.