క్రికెటర్లకు వివ్రాంతి ఇవ్వాలి: రవిశాస్త్రి
న్యూఢిల్లీ,సెప్టెంబర్9(జనంసాక్షి): వరుస షెడ్యూళ్లతో బిజీగా ఉన్న భారత క్రికెటర్లకు బ్రేక్ ఇవ్వడం అనివార్యమని చీఫ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు క్రికెటర్లకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి రవిశాస్త్రి విన్నవించారు. అది కూడా ఎక్కువ రోజులు విశ్రాంతి కాకుండా స్వల్ప విరామాన్ని ఇస్తే నూతనుత్తేజంతో వారు పని చేస్తారన్నారు. ఇటీవల శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్ ను భారత జట్టు దిగ్విజయం పూర్తి చేసుకోవడంతో పాటు, స్వదేశంలో ఆస్టేల్రియాతో పరిమిత ఓవర్ల సిరీస్ కు సన్నద్ధమవుతోంది. ఇలా బిజీ షెడ్యూల్లో ఆటగాళ్లకు ఒక చిన్న విరామం ఇచ్చే ఆలోచన బీసీసీఐ చేయాలని రవిశాస్త్రి పేర్కొన్నారు. దీనిలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టు నేతృత్వంలో నియమించబడ్డ సీవోఏ సభ్యులకు రవిశాస్త్రి తన విజ్ఞప్తిని తెలియజేశారు.
‘భారత జట్టు అంతర్జాతీయ క్యాలెండర్ చాలా బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆటగాళ్లు ప్రయాణాలతో అలసిపోతున్నారు. దీన్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకోవాలి. ఆటగాళ్లు కొత్తదనంతో మళ్లీ బరిలోకి దిగాలంటే విశ్రాంతి అనేది సాయం చేస్తుంది. ఒక పర్యటన ముగిసిన తరువాత ఒక చిన్నపాటి బ్రేక్ ను భారత క్రికెటర్లకు ఇస్తే బాగుటుంది. ఈ తరహా పద్దతిని ఆస్టేల్రియాయా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు అనుసరిస్తున్నాయి. మనం కూడా అదే పద్ధతిని అవలంభిస్తే బాగుంటందనేది నా సూచన’అని రవిశాస్త్రి పేర్కొన్నారు. దీనికి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి.