క్రికెటర్లపై కిట్లు విసిరిన మంత్రి

వైరల్‌గా మారిన వీడియో

బెంగళూరు,నవంబర్‌1(జ‌నంసాక్షి): మొన్న వరద బాధితులకు బిస్కెట్‌ ప్యాకెట్లను ఓ మంత్రి విసిరేస్తే.. నేడు క్రికెటర్లకు క్రికెట్‌ కిట్లను మరో మంత్రి విసిరేసి వివాదాస్పదమయ్యారు. కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌వీ దేశ్‌పాండే తన సొంత నియోజకవర్గమైన హలియాల్‌లో ఇండోర్‌ స్టేడియంను బుధవారం ప్రారంభించారు. అనంతరం అక్కడ క్రికెటర్లకు క్రికెట్‌ కిట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అయితే క్రికెటర్ల పేర్లు చదువుతుండగా.. వారు సభా వేదిక వద్దకు వచ్చేందుకు కాస్త ఆలస్యమైంది. దీంతో ఆ కిట్లను క్రికెటర్లపైకి మంత్రి దేశ్‌పాండే విసిరేశారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక

మాధ్యమాలలో వైరల్‌ అయింది. ఈ ఏడాది ఆగస్టులో హసన్‌ ఏరియాలో వరదలు రావడం వల్ల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం విదితమే. ఈ క్రమంలో కేంద్రాల్లో పునరావాసం పొందుతున్న ప్రజలకు మంత్రి హెచ్‌డీ రేవణ్ణ బిస్కెట్‌ ప్యాకెట్లను విసిరేసిన సంగతి తెలిసిందే.