గృహిణిపై లైంగిక వేధింపులు.. యువకుడి అరెస్టు

నాగోలు: ఓ గృహిణితో పరిచయం పెంచుకుని.. మత్తుపదార్థాలిచ్చి లోబరచుకుని.. గత ఆరునెలలుగా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న యువకుడిని అరెస్టుచేసి రిమాండుకు తరలించిన సంఘటన ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… అనంతపురం తాడిపత్రికి చెందిన కొమర్‌శెట్టి గిరీష్‌(27) అక్కడే శ్రీవిద్యాదుర్గ మెడికల్‌దుకాణం నిర్వహిస్తున్నాడు. ఓ స్నేహితుడి ద్వారా నగరంలోని ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో నివసించే ఓ టీవీ ఆర్టిస్టుతో గతేడాది నవంబరులో పరిచయం పెంచుకున్నాడు. ఆమె అవసరార్థం రూ.లక్ష చేబదులు ఇచ్చాడు. సంబంధిత ష్యూరిటీ పేపర్లపై సంతకం చేయించుకునే కారణంతో ఆమె ఇంటికి వెళ్లాడు. దృష్టిని మరల్చి కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ఆమెతో తాగించాడు. మత్తులో అపస్మారకస్థితికి చేరగానే అత్యాచారం చేశాడు. ఆపై ఆమె ఫొటోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించి.. అనంతపురానికి పిలిపించుకున్నాడు. కల్యాణదుర్గంలోని ఓ ఇంటిలో ఆమెను ఉంచి లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగక ఆమె మెడలోని బంగారు నగలను లాక్కుని వాటిని అనంతపురంలోని ఓ బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.1.1లక్షల నగదు రుణంగా తీసుకున్నాడు. అతని వేధింపులు భరించలేని ఆ గృహిణి చివరికి ఎల్బీనగర్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నిందితుడ్ని అరెస్టుచేసి రిమాండుకు తరలించారు.