గేల్ సెంచరీ కొట్టు.. కానీ గెలుపు భారత్‌దే!

1న్యూఢిల్లీ: బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కి వెస్టిండీస్‌ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్‌ గేల్ వీరాభిమాని. అమితాబ్ సినిమాలంటే గేల్ పడి చస్తాడు. అలాంటి తన ఆరాధ్య నటుడి నుంచి ఊహించని ఆతిథ్యం అందుకోవడంతో క్రిస్ గేల్‌ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. అమితాబ్ తన ఇంటికి పిలిచి.. విందు ఇచ్చాడని, ఆయన ఆతిథ్యం తనను ముగ్ధుడిని చేసిందని గేల్ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో వెల్లడించాడు.

‘మీ ఇంటికి పిలిచి ఆతిథ్యమిచ్చినందకు కృతజ్ఞతలు. చాలా పుస్తకాలు కూడా కానుకగా ఇచ్చారు. బాస్‌ (అమితాబ్‌) నేను సెంచరీ కొట్టాలి, కానీ ఇండియానే గెలువాలని కోరుకున్నారు. నేను మాత్రం సెంచరీ కొట్టకపోయినా పర్వాలేదు మేము గెలువాలని కోరుకుంటున్నా’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం వెస్టిండీస్‌తో భారత్‌ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా వీరాభిమానిగా బిగ్‌ బీ.. గేల్ సెంచరీ కొట్టినా భారత్ గెలువాలని కోరుకొని ఉంటాడు. మరోవైపు ఈ ఆతిథ్యం గురించి ‘పికు’ స్టార్ అమితాబ్ స్పందిస్తూ ‘అతను నా ఫ్యాన్ అని తెలియదు. ఎంతో హుందాగా నా ఆతిథ్యం స్వీకరించాడు. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్‌లో నా కంప్లిమెంట్‌ను అతను స్వీకరిస్తాడే ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశాడు. తాజాగా ‘పికు’ సినిమాకుగాను అమితాబ్‌ మరోసారి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని గెలుపొందిన సంగతి తెలిసిందే.