గొలుసు దొంగను పట్టుకున్న స్థానికులు*

 దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత
బాన్సువాడ, అక్టోబర్ 10 (జనంసాక్షి):
బంగారు గొలుసు దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన బాన్సువాడ పట్టణ కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. పట్టణంలోని జండా గల్లి కాలనీకి చెందిన కొత్త అశోక్ భార్య పూజ కోసం పువ్వులను కోస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఆగంతకుడు ఆమె మెడలో నుండి బంగారు గొలుసును లాగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి దుండగున్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం  పోలీసులకు అప్పగించారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో పట్టణం వాసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసు శాఖ గట్టి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.