గోదావరి జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు

 

 

 

 

 

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలశక్తి
మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టు వద్ద నెలకొల్పిన ప్రాజెక్టుకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం దేవీపట్నం మండలం ఇందుకూరు-1 ఆర్‌ అండ్‌ ఆర్‌ పునరావస కాలనీలో పర్యటించారు. ఏనుగులగూడెంలో పోలవరం నిర్వాసితులతో వారు  మాట్లాడారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. పోలవరం పూర్తికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నామని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అండగా నిలబడుతున్నామని పేర్కొన్నారు. నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. కాలనీలో వసతులు బాగున్నాయని కేంద్రమంత్రి ప్రశంసించారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఇంకా మెరుగు పరచాలని సూచించారు. ఏపీ సీఎం జగన్‌ మాట్లాడుతూ .. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరం ప్రాజెక్టు అని, దానిని పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

పునరావాస పనులపై అధికారులు మరింత శ్రద్ధపెట్టాలని సూచించారు. నిర్వాసితులకు పరిహారాన్ని తమ ప్రభుత్వం పెంచిందని, నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని, పునరావాస కాలనీల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.