‘గౌరవప్రదమైన’ వేతనాల కోసం చికాగో వర్కర్ల ఆందోళన

బడా రిటైల్‌ స్టోర్స్‌ల్లో పనిచేస్తున్న వర్కర్లు తమకు గౌరవప్రదమైన మెరుగైన వేతనాలు అందించాలంటూ ఆందోళన బాట పట్టారు. గత నవంబర్‌లో న్యూయార్క్‌ నగరంలో వాల్‌మార్ట్‌ సంస్థ ఉద్యగుల ఆందోళన విజయవంతం కావటంతో మెక్‌డోనాల్డ్‌, సబ్‌వే, డంకిన్‌ డోనట్స్‌, మాసీస్‌, విక్టొరియాస్‌ సీక్రెట్‌ అండ్‌ సియర్స్‌ వంటి సంస్థల ఉద్యోగులు కూడా తమకు మెరుగైన వేతనాలు కావాలంటూ ఆందోళన బాట పట్టారు. దేశవ్యాప్తంగా ఉద్యోగులంతా తీవ్రంగా అలిసిపోయి వున్నారని మేసీ కంపనీకి చెందిన ఒక కార్మికుడు అన్నారు. తాము రోజంతా శ్రమించినా వచ్చే సంపాదన కుటుంబ పోషణకు చాలటం లేదని తమ పరిస్థితిని వివరించాడు. న్యూయార్క్‌లో ఉద్యోగులు, కార్మికుల పోరట స్పూర్తి తమను ఉత్తేజపరిచిందని, తాము కూడా ఇదే తరహలో చికాగోలో ఆందళనను చేపట్టనున్నామని అతడు చెప్పాడు. చికాగోలో అధికశాతం వర్కర్ల గంటకు 8.25 డాలర్ల వంతున కనీస వేతనాన్ని ఆర్జిస్తున్నారు. ఇది కనీసావరాలకు కూడా సరిపోవటం లేదని గంటకు 15 డాలర్ల కనీస వేతనాన్ని అందించాలని తాము ప్రచారోద్యమాన్ని చేపట్టినట్లు చికాగోలో ఫాస్ట్‌పుడ్‌, రిటెయిల్‌ వర్కర్స్‌ యూనియన్‌ చికాగో వర్కర్స్‌ ఆర్గనైజింగ్‌ కమిటీకి చెందిన లోరెయిన్‌ ఛావెజ్‌ చెప్పారు.
చికాగో డౌన్‌టౌన్‌లో వున్న రెస్టారెంట్స్‌, స్టోర్స పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఏటా దాదాపు 400 కోట్ల డాలర్ల మేర వ్యాపార లావావేవీలు సాగిస్తుంటారు.
ఈ లాభాలన్నీ దాదాపు ఆయా సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు, ఇన్వెస్టర్ల జేబుల్లోకే వెళ్లిపోతుంటాయి తప్ప తమకు కనీస అవసరాలు తీర్చే పాటి వేతనాలను కూడా అందించలేకపోతున్నాయని ఛావెజ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రమించే కార్మికులు., ఉద్యగులకు అందించే వేతనాలు వారి కుటుంబ పోషణకు తగిన విధంగా వుండాలన్నది తమ విశ్వాసమని అందుకే వీరంతా 15 డాలర్ల కనీస వేతనం కోసం రోడ్డెక్కుతున్నారని వివరించాడు.