గౌరీ లంకేష్‌ హంతకుల ఊహాచిత్రాల విడుదల

బెంగళూరు,అక్టోబర్‌ 14,(జనంసాక్షి): సంచలనం సృష్టించిన ప్రముఖ సీనియర్‌ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్యకు సంబంధించిన అనుమానితుల చిత్రాలను సిట్‌ బృందం విడుదల చేసింది. శనివారం నిర్వహించిన విూడియా సమావేశంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇద్దరు అనుమానితుల స్కెచ్‌లను విడుదల చేసింది. హత్య జరిగే రోజు లంకేశ్‌ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించిన అనుమానితులకు సంబంధించిన వీడియో ఆధారాలు తమ దగ్గర ఉన్నట్లు సిట్‌ పోలీస్‌ చీఫ్‌ బీకే.సింగ్‌ తెలిపారు. మూడు స్కెచ్‌లను విడుదల చేసినప్పటికీ అందులో రెండు ఫొటోలు ఒకే అనుమానితుడవని ఆయన తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం ఇద్దరు ఆర్టిస్టులతో చిత్రాలు గీయించినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ హత్య కేసులో దాదాపు 200 నుంచి 250 మందిని విచారణ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎంఎం.కల్‌బుర్గి హత్యకు ఉపయోగించిన మారణాయుధాలనే లంకేశ్‌ను హత్య చేసేందుకు ఉపయోగించారనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని సింగ్‌ తెలిపారు. సెప్టెంబరు 5న బెంగళూరులోని ఆమె ఇంటి వద్దే లంకేశ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితుల వివరాలను తెలియజేసిన వారికి రూ.10లక్షలు రివార్డు కూడా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది.