గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు.. పరీక్ష మళ్లీ నిర్వహించండి.. టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు.. పరీక్ష మళ్లీ నిర్వహించండి.. టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు

ఈ ఏడాది జూన్‌ 11న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ (Group-1 Prilims) పరీక్షను హైకోర్టు (High court) రద్దుచేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని (TSPSC) ఆదేశించింది. మొత్తం 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం జూన్‌ 11న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 2.32 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే పరీక్షలో బయోమెట్రిక్‌ వివరాలు తీసుకోలేదని, హాల్‌ టికెట్‌ నంబర్‌ లేకుండా ఓఎంఆర్‌ షీట్లు ఇచ్చారని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షను రద్దు చేయాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పరీక్షను రద్దుచేస్తూ తీర్పు వెలువరించింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్వహణా సంస్థను ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పుపై టీఎస్‌పీఎస్సీ డివిజన్‌ బెంచ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తున్నది. పేపర్‌ లీకేజీ కారణంగా గ్రూప్‌-1 పరీక్ష ఓసారి రద్దయిన విషయం తెలిసిందే.