గ్రేటర్‌లో ‘నోటా’ లేదు

1
హైదరాబాద్‌,జనవరి23(జనంసాక్షి):  గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో నోటా ఆప్షన్‌ లేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం

హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ….గ్రేటర్‌ ఎన్నికల బరిలో మొత్తం 1333 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని చెప్పారు. గ్రేటర్‌ పరిధిలో 7,802 పోలింగ్‌

కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని… ఇప్పటి వరకు 13.87 లక్షల మంది ఓటర్లు స్లిప్పులు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఫ్రిబవరి 2న జరిగే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో IనోటాI ఉండదని జిహెచ్‌ఎంసి ఎన్నికల అధికారి, కమిషనర్‌ డా.బి.జనార్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో 45 ఆగ్జిలరీ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, వీటితో మొత్తం 7,802 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మొత్తం 1,333 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో అత్యధికంగా 16మందికిపైగా అభ్యర్థులు 5వార్డులలో పోటీ చేస్తుండగా అతి తక్కువగా నలుగురు 8వార్డులలో పోటీ చేస్తున్నారని స్పష్టం చేశారు. జిహెచ్‌ఎంసిలో 74,23,980 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 13.87లక్షల మందికి వ్యక్తిగతంగా ఓటరు స్లిప్‌లను అందజేశామని డా.జనార్థన్‌రెడ్డి తెలిపారు. అత్యధికంగా జంగంమెట్‌ డివిజన్‌ నుంచి 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అత్యల్పంగా 8 డివిజన్ల నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు జనార్థన్‌ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే నోటా(నన్‌ ఆఫ్‌ ది ఎబవ్‌) ఆప్షన్‌ ఎన్నుకునే విధానాన్ని సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్‌ 27న రూలింగ్‌ ఇచ్చింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నోటాను అమలులోకి తెచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా 1,67,000 అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు, పోస్టర్లను తొలగించామని పేర్కొన్నారు. 66,570 పోస్టర్లు, 46,941ఫ్లెక్సీలు, 46,627 బ్యానర్లు, 7,066 కటౌట్లను తొలగించినట్లు కమిషనర్‌ వివరించారు.  కాగా ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో  ఓటు వేయడానికి ఓటరు గుర్తింపు కార్డు లేదా ఎన్నికల కమిషన్‌ నిర్ణయించిన 21గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒకటి సంబంధిత ఎన్నికల అధికారికి చూపించాల్సి ఉంటుందని జిహెచ్‌ఎంసి ఎన్నికల అధికారి, కమిషనర్‌ డా.బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు. 1. ఆధార్‌కార్డు, 2. పాస్‌పోర్ట్‌, 3. డ్రైవింగ్‌ లైసెన్స్‌, 4. పాన్‌కార్డు, 5. బ్యాంకులు, పోస్టాపీసులు జారీచేసిన పాసుపుస్తకాలు, 6. కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు జారీచేసిన సర్వీసు గుర్తింపు కార్డులు, 7. ఎన్నికల నోటిఫికేషన్‌ కన్న ముందు జారీచేసిన రేషన్‌కార్డులు, ఆహార భద్రతాకార్డు, 8.ఫోటో కలిగి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాస్ట్‌ సర్టిఫికేట్లు, 9. ఫోటోగ్రాఫ్‌ కలిగిన ఉన్న పెన్షన్‌ డాక్యుమెంట్లు, 10. ఫోటోగ్రాఫ్‌ కలిగిన ఆయుదాల లైసెన్స్‌, 11. ఫోటోగ్రాఫ్‌ కలిగిన వికలాంగుల సర్టిఫికేట్‌, 12. ప్రజాప్రతినిధులకు  సచివాలయం ద్వారా అందించిన ఫోటో గుర్తింపు కార్డు, 13. ఉపాధి హావిూపథకం ద్వారా అందిన జాబ్‌ కార్డు, 14. బార్‌కౌన్సిల్‌ తన సభ్యులకు జారీచేసిన గుర్తింపుకార్డులు, 15. పార్లమెంట్‌ సభ్యులకు లోక్‌సభ అందజేసిన గుర్తింపు కార్డులు, 16. కార్మికశాఖ అందించిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకం గుర్తింపు కార్డు, 17. పట్టాదారు పాసుపుస్తకాలు, 18. ప్రాపర్టీ డాక్యుమెంట్స్‌, 19. ఏటీఎం కార్డులు, 20. స్మార్ట్‌కార్డు, 21. స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపు కార్డులు.

పోలింగ్‌ ఏజెంట్ల నియామకానికి మార్గదర్శకాలు

ఫిబ్రవరి 2న జరిగే జిహెచ్‌ఎంసి ఎన్నికల పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు పోలింగ్‌ ఏజెంట్లు విధిగా సంబంధిత పోలింగ్‌ కేంద్రంలో ఓటరుగా ఉండాలని జిహెచ్‌ఎంసి ఎన్నికల అధికారి, కమిషనర్‌ డా.బి.జనార్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ఏజెంట్‌గా ఉండేవారికి ఓటరు గుర్తింపుకార్డు,  ఆధార్‌ కార్డు లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫై చేసిన డాక్యుమెంట్లలో  ఏదైన ఒకటి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. మంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేదా సెక్యూరిటీ ఉన్న వ్యక్తులు పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండటానికి అనర్హులని పేర్కొన్నారు. పోలింగ్‌ ఏజెంట్ల నియామకానికి సంబంధిత రిటర్నింగ్‌ అధికారుల వద్ద ముందుగా వారి వివరాలతో దరఖాస్తు సమర్పించుకోవాలని కమిషనర్‌ పేర్కొన్నారు.