చంద్రబాబు ఊసరవెల్లి! 

– అవసరాన్ని బట్టి రంగులు మారుస్తాడు
– పోలింగ్‌ తరువాతకూడా అప్పులు తెచ్చిన ఘనుడు చంద్రబాబు
– వైసీపీ అధికార ప్రతినిధి రామచంద్రయ్య
అమరావతి, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : చంద్రబాబు నాయుడు అవసరాన్ని బట్టి రంగులు మార్చే ఊసరవెల్లి అని  వైసీపీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. విభజనకు ముందు సోనియా దెయ్యమని, రాహుల్‌ గాంధీ అని పనికిరాని వ్యక్తి అని ఇప్పుడేమో సోనియా గొప్ప నాయకురాలు, రాహుల్‌ విజన్‌ ఉన్న నేత అని చెప్పడం రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడవటం కాదా అంటూ ప్రశ్నించారు. టీడీపీ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్‌తో సిగ్గు లేకుండా చేతులు కలిపారంటూ విమర్శించారు. విభజన తరువాత కాంగ్రెస్‌ అధినేతలు రాష్ట్రానికి వస్తే.. నిరసనలు తెలిపి.. ఇప్పుడు వాళ్లను పొగుడుతున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు నాటకాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. పారదర్శకత అనేది లేకుండా రహస్యంగా జీవో జారీ చేశారంటూ దుయ్యబట్టారు. ఇంతటి ఘోరమైన పాలన దేశ చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. పోలింగ్‌ ముగిసిన తరువాత కూడా అప్పులు తెచ్చిన ఘనుడు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగానికి విరుద్దంగా నడుచుకుంటున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణ ఓట్లు అడగలేని చంద్రబాబు.. పక్క రాష్ట్రాలకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నాడని ప్రశ్నించారు.