చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది

డిజిపికి లేఖ రాసిన వర్ల రామయ్య
అమరావతి,మార్చి9(జనం సాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రాణాలకు ముప్పు ఉందని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించాలంటూ ఆయన లేఖలో కోరారు. చంద్రబాబుకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉందని లేఖలో వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ కార్యాలయాన్ని సందర్శించే నాయకులకు సైతం తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి తీవ్రమైన ముప్పు ఉందని డీజీపీకి రాసిన లేఖలో వర్ల రామయ్య వివరించారు. ఇప్పటికే కొందరు దుండగులు పార్టీ కార్యాలయంపై దాడి చేసిన సంగతిని ఆయన గుర్తుచేశారు. అందువల్ల వెంటనే స్పందించి పార్టీ కార్యాలయానికి నిత్యం సాయుధ బలగాలతో రక్షణ కల్పించాలని లేఖలో డీజీపీని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు వర్ల రామయ్య. ముఖ్యంగా వైసీపీ నేతల నుంచి తమకు ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.