చంద్రబాబు ముందు తన ఇల్లు చక్కబెట్టుకుంటే మంచిది
ప్రజల దృష్టి మరల్చడానికే కూటమి నాటకం
మండిపడ్డ బిజెపి నేత రాం మాధవ్
న్యూఢిల్లీ,నవంబర్3(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ప్రతిపక్ష పార్టీలతో జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలపై బీజేపీ మరోసారి నిప్పులు చెరిగింది. దేశాన్ని కాపాడడం మాట అటుంచి ముందు ఆయన తన సీటు కాపాడుకోవాలని సూచించింది. బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్మాధవ్ శనివారంనాడిక్కడ విూడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తన సొంత రాష్ట్రంలో సీఎం సీటు కాపాడుకునే ప్రయత్నం చేయడం మంచిదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతిని తలపించే రీతిలో ప్రజాదరణ లేని చర్యలకు పాల్పడు తోందని విమర్శించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. సొంత పార్టీ సిద్దాంతాలకు తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని, ఒకప్పుడు సొంత మామ ఎన్టీరామారావునే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు సొంత పార్టీ సభ్యులకు కూడా వెన్నుపోటు పొడిచారని రామ్ మాధవ్ విమర్శించారు. ఎపిలో తన పాలనపై వస్తున్న వ్యతిరేకతను కప్పి పు/-చుకునేందుకు బాబు చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటని మాధవ్ వ్యాఖ్యానించారు.