చత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేల్చిన మావోయిస్టులు

2
నలుగురు జవాన్లు మృతి, ఏడుగురికి గాయాలు

రాయపూర్‌,ఏప్రిల్‌13(జనంసాక్షి): ఛత్తీస్‌గడ్లో  మావోయిస్టులు మరోసరి పంజా విసిరారు. వరుసగా మూడోరోజు కూడా దాడికి తెగించి నలుగురు పోలీసులను పొట్టన పెట్టుకున్నారు. దంతెవాడ జిల్లాలోని కిరండోల్‌- పల్నార్‌ వద్ద పోలీసులు ప్రయాణిస్తోన్న మైన్‌ ప్రొటెక్టెడ్‌ వాహనం లక్ష్యంగా పేలుడు జరిపారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు మరణించగా, ఏడుగురికి గాయాలయ్యాయి. అత్యంత రక్షణాత్మకంగా రూపొందించిన మైన్‌ ప్రూఫ్‌ వాహనం.. మావోయిస్టులు పేల్చిన ల్యాండ్‌ మైన్‌ ధాటికి 40- 50 అడుగుల ఎత్తుకు ఎగిరిపడింది. ఆ సమయంలో వాహనంలో 12 మంది పోలీసులు ఉన్నట్లు తెలిసింది. గత వారం రోజులుగా చోటుచేసకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఎస్పీఎఫ్‌ బలగాలు కూంబింగ్‌ ను ముమ్మరం చేశాయ. వారిని అడ్డుకునేందుకు మావోయిస్టులు సైతం ప్రతిదాడులకు దిగుతూ దండకారణ్యంపై తమ పట్టును నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన వారం రోజుల్లో పోలీసులపై మావోయిస్టులు జరిపిన మూడోదాడి ఇది. గత సోమవారం సుక్మా జిల్లాలోని చింతగుఫా అటవీప్రాంతంలో ఏడుగురు ఎస్టీఎఫ్‌ జవాన్లను మట్టుబెట్టిన మావోయిస్టులు.. శవాలకోసం వెళ్లిన సీర్పీఎఫ్‌ బలగాలపైనా కాల్పులు జరిపారు. ఆదివారం కాంకేర్‌ జిల్లాలోని ఓ ఐరన్‌ ఓర్‌ మైన్‌ వద్ద 17 వాహనాలను తగలబెట్టారు. ఆ క్రమంలోనే సోమవారం పోలీసులు ప్రయాణిస్తోన్న వాహనాన్ని ల్యాండ్‌మైన్‌తో పేల్చారు. దంతెవాడ వద్ద జవాన్లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చారు.  గత మూడు రోజులుగా మావోయిస్టులు వరస ఘాతుకాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఉదయం మరో జవాన్‌ను హతమార్చిన సంగతి తెలిసందే. కొద్ది రోజుల క్రితం ఏడుగురు జవాన్లను మందుపాతర ద్వారా బలితీసుకున్న మావోయిస్టులు ,పద్దెనిమిది వాహనాలను నాశనం చేశారు.గత మూడు నెలలుగా ప్రశాంతంగా ఉన్నా, ఇప్పుడు సడన్‌ గా వీరి కార్యకలాపాలు పెరిగాయి. వారం క్రితం ప్లీనరీ జరిగిన తర్వాత వీరి కార్యకలాపాలు పెరిగాయని చెబుతున్నారు.వీరి దాడులలో గాయపడ్డ,మరణించిన జవాన్లను హెలికాఫ్టర్‌ లలో తరలించవలసి వస్తోంది.నిజంగానే ఇది దురదృష్టకర పరిస్థితి.