చింతగుర్తికి బస్సులు పునరుద్ధరించండి

ఖమ్మం, అక్టోబర్‌ 29: అర్బన్‌ మండంలోని చింతగుర్తి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని గ్రామస్థులు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా చింతగుర్తి గ్రామానికి బస్సు సర్వీసులు నిలిపివేశారు. ప్రస్తుతం ఈ బస్సులు చింతుగుర్తి బోర్డుతో గణేష్‌వరం వరకు మాత్రమే నడుపుతున్నారు. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తామంతా ఆర్టీసీ అధికారుల సూచన మేరకు 300ల వనితా కార్డులు తీసుకున్నామని గ్రామస్థులు తెలిపారు. అదే విధంగా గ్రామం నుంచి 30 మంది నెలవారీ బస్సు పాస్‌లు తీసుకొని ప్రయాణం చేస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. బస్సు సర్వీసులను పూర్తిగా నిలిపివేయడంతో ఆటోపై ఆధారపడి ప్రయాణించాల్సి వస్తుందని గ్రామస్థులు వాపోతున్నారు. ఆటోవాలలు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తుండడంతో తాము మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నామని, ప్రమాదం జరిగితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని గ్రామస్థులు అంటున్నారు. వర్షాలు లేని కారణంగా చింతగుర్తి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని పునరుద్దరించాలని, గణేష్‌వరం వరకు నడుస్తున్న బస్సులు చింతగుర్తి వరకు నడపాలని గ్రామస్థులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.