చికిత్స నిరాకరిస్తే ఆసుపత్రులపై కేసులు
ఢిల్లీ దవాఖానాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కేజ్రివాల్
న్యూఢిల్లీ సెప్టెంబర్ 14(జనంసాక్షి):
డెంగీతో చిన్నారి మృతి, కుటుంబం ఆత్మ హత్య కేసు పై ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. పలు ఆస్పత్రుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చికిత్స నిరాకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్పత్రులపై కేసులు పెట్టాలని కేజ్రీవాల్ సూచించారు. వివరాలు..ఒక్కగానొక్క కొడుకు డెంగీతో చనిపోవడం తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీలోని లాడోసరాయ్లో జరిగింది. బిడ్డ అంత్యక్రియలు నిర్వహించిన 24గంటల్లోపే వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఒడిశాకు చెందిన లక్ష్మీచంద్, బబితలు కొన్నేళ్లుగా లాడోసరాయ్ ఉంటున్నారు. ఇటీవల వారి కొడుకు అవినాశ్(7)కు డెంగీ సోకింది. దగ్గర్లోని ఆస్పత్రిలో చికిత్సచేసినా తగ్గలేదు. రెండు ఆస్పత్రులు పడకల్లేవని చేర్చుకోలేదు. మరో ఆస్పత్రిలో చేర్పించారు. వ్యాధి తీవ్రం కావడంతో అవినాశ్ సెప్టెంబర్ 8న చనిపోయాడు. అదే రోజు అంత్యక్రియలు నిర్వహించిన తల్లిదండ్రులు.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి దగ్గర్లోని పాఠశాలలో మృతదేహాలు లభ్యమయ్యాయి.డనిపబజూ; ఇద్దరూ చేతులు కట్టేసుకుని భవంతి పై నుంచి దూకారు.
ఢిల్లీలో డెంగ్యూ విజృంభిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని ఆస్పత్రుల్లో బెడ్స్ ను పెంచాలని సూచించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా పలు ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. డెంగ్యూను అరికట్టేందుకు, రోగులకు చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రోగులను చేర్చుకునేందుకు నిరాకరిస్తున్న హాస్పిటల్స్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టెస్టులకు ఎక్కువ డబ్బులు తీసుకోకుండా అన్ని హాస్పిటల్స్ లో ఒకే రేటుకు వైద్య సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్కూళ్లకు వెళ్లే విద్యార్ధులకు ఇక నుంచి ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ వేసి పంపించాలని కేజ్రీవాల్ సూచించారు.