చిన్నారి వైశాలికి ప్రధాని మోదీ లేఖ

పుణె: ప్రధాని నరేంద్ర మోదీ సహాయంతో గత వారం గుండె శస్త్రచికిత్స చేయించుకున్న చిన్నారి వైశాలికి స్వయంగా మోదీ లేఖ రాశారు. వైశాలి దేశం గర్వించేలా గొప్ప స్థాయికి చేరుకోవాలని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు. తన గుండె శస్త్రచికిత్సకు సహాయం చేయాలని కోరుతూ మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఆరేళ్ల వైశాలి ప్రధాని మోదీకి లేఖ రాయడంతో ఆమెకు తక్షణమే సహాయం అందిన సంగతి తెలిసిందే. గత వారం ఆమెకు ఉచితంగా శస్త్రచికిత్స చేశారు. దీంతో మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ చిన్నారి మరో లేఖ పంపించింది.మొదటి లేఖకు సహాయం అందితే.. రెండోసారి పంపించిన లేఖకు స్వయంగా మోదీ నుంచి సమాధానం వచ్చింది. ఆయన సంతకంతో కూడిన లేఖ నిన్న సాయంత్రం వైశాలి కుటుంబసభ్యులకు అందింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు. మోదీ లేఖ పంపినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. జులై 1 నుంచి మళ్లీ వైశాలిని స్కూలుకు పంపిస్తామన్నారు. ప్రధాని సహాయంతో పాపకు శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఎంతో మంది పాప చదువుకు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారని చెప్పారు.