చున్నీసరిగా కప్పుకోలేదని ..

లక్నో: తలపై ముసుగు వేసుకోలేదని నాలుగేళ్ల  చిన్నారిని  కొట్టి చంపిన ఘటన విషాదాన్ని నింపింది. ఉత్తర ప్రదేశ్లోని బరేలీకి చెందిన జాఫర్ హుస్సేన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. నాలుగేళ్ల పర్హీన్ భోజనం చేస్తుండగా తలపై నిండా ముసుగు వేసుకోలేదనే కారణంతో  కన్నకూతుర్ని దారుణంగా పొట్టన పెట్టుకున్నాడు.

వివరాల్లోకి వెళితే ఆకలితో ఉన్న చిన్నారి ఫరీన్ అమ్మతో కలిసి  అన్నం తింటోంది. ఈ క్రమంలో తన తలపై వేసుకున్న చున్నీ తొలగిన విషయాన్ని గమనించలేదు. ఇది చూసిన తండ్రి ఆవేశంతో ఊగిపోయాడు. ఒక్క ఉదుటున ఆ చిన్నారిని నేలకేసి విపరీతంగా బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. పాప తల్లి అతడిని వారించడానికి విశ్వప్రయత్నం చేసింది. కానీ ఉన్మాదంతో ఊగిపోతున్న అతగాడు తన భార్యపై కూడా  దాడికి దిగాడు. అంతేకాదు పాప శవాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టాలని  హుకుం జారీ చేశాడు. కానీ దీనికి నిరాకరించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మిగిలిన కుటుంబ సభ్యులందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. పాపను రక్షించుకోలేకపోయానని తల్లి పోలీసులకు తెలిపింది. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  హుస్సేన్ ను ప్రశ్నిస్తున్నామని  సీనియర్ పోలీస్ అధికారి బీకే శ్రీవాస్తవ్ తెలిపారు.