చేపల్లో కరోనా ఆనవాళ్లు..

 

 

భారత్‌ దిగుమతులు నిలిపేసిన చైనా

న్యూఢిల్లీ, నవంబర్‌13 (జనంసాక్షి)  : కరోనా వైరస్‌ అంతటా వ్యాపిస్తోంది.. చివరికి ఆహారపదర్ధాలనూ వదలడం లేదా మహమ్మారి.. ఇండియాకు చెందిన బసు ఇంటర్నేషనల్‌ కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్న చేపల్లో కరోనా వైరస్‌ ఉండటంతో చైనా ఉలిక్కిపడింది.. ఇప్పటికే కరోనాతో కకావికలం అయిన చైనా మరో ఆలోచన చేయకుండా దిగుమతులకు బ్రేక్‌ వేసింది.. గడ్డకట్టించిన కటిల్‌ఫిష్‌ ప్యాకేజీలోని మూడు శాంపిల్స్‌లో కరోనా వైరస్‌ ఉన్నట్టు కస్టమ్స్‌ అధికారులు గుర్తించినట్టు రాయిటర్స్‌ వార్తసంస్థ తెలిపింది..ఈ భయానికే వారం రోజుల పాటు చైనా దిగుమతులను ఆపేసిందని రాయిటర్స్‌ పేర్కొంది.. మొన్నామధ్య ఇండోనేషియాకు చెందిన పీటీ అనురాగ్‌ లౌట్‌ కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్న చేపల్లోనూ కరోనా వైరస్‌ ఉందని గుర్తించారు.. ఆ కంపెనీ దిగుమతులను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది చైనా.. అదేమిటో చైనాకు వచ్చే ఆహారపదార్థాలలోనే కరోనా వైరస్‌ ఉంటోంది.. అక్టోబర్‌లో బ్రెజిల్‌, ఈక్వెడార్‌, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్న ఆహారపదార్థాలలోనూ కరోనా వైరస్‌ ఉందట! అప్పుడా విషయం బయటపడటంతో చైనా అలెర్ట్‌గా ఉంటోంది.. వచ్చిన ప్రతి ఆహారపదార్థాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.. ఈక్వెడార్‌ నుంచి వచ్చిన రొయ్యలలో వైరస్‌ ఉన్నట్టు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు.. అలాగే బ్రెజిల్‌ నుంచి వచ్చిన చికెన్‌ వింగ్స్‌లో కూడా వైరస్‌ కనిపించింది.