.చైనా మరోసారి కవ్వింపు చర్యలు

` భారత సరిహద్దు సవిూపంలో ఆ దేశ బంకర్లు, సొరంగాలు..!
దిల్లీ(జనంసాక్షి): భారత్‌`చైనా సరిహద్దులో కొన్నేళ్లుగా నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం సద్దుమణగక ముందే.. చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది.తాజాగా చైనా విడుదల చేసిన ‘మ్యాప్‌’తో.. సరిహద్దు వివాదాన్ని మరోసారి రగిల్చే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో ఉత్తర లద్దాఖ్‌లోని సరిహద్దు సవిూపంలో చైనా అనేక సొరంగాలు, బంకర్లు రోడ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలు వైరల్‌గా మారాయి. ఇది తమ ప్రాంతమంటూ చైనా పేర్కొంటున్న అక్సాయ్‌ చిన్‌లోనే ఇవి ఉండటం కలవరపెట్టే విషయం.అరుణాచల్‌ప్రదేశ్‌, అక్సాయ్‌ చిన్‌లను తమ భూభాగంలో చూపుతూ రూపొందించిన మ్యాప్‌ను చైనా ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎటువంటి ఆధారాల్లేకుండా చైనా ఈ మ్యాప్‌ను రూపొందించిందని భారత్‌ స్పష్టం చేస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో చైనా తమదని చెబుతున్న అక్సాయ్‌ చిన్‌ ప్రాంతంలోనే భారీ నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడైంది. అనేక పటిష్ఠ బంకర్లు, సొరంగాల నిర్మాణం చేపట్టినట్లు మాక్సర్‌ టెక్నాలజీస్‌ శాటిలైట్‌ చిత్రాల్లో తేలింది. వీటితోపాటు రోడ్ల నిర్మాణానికి అవసరమైన యంత్రాలు, సొరంగాల ప్రవేశం వద్ద నిర్మాణ సామగ్రి భారీ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు.అక్సాయ్‌ చిన్‌లో భారత్‌ వాయుసేనకు ఉన్న సానుకూలతలు, ఒకవేళ దాడులకు దిగితే దీటుగా ఎదుర్కొనేందుకే చైనా అక్కడ ఈ వ్యూహాలు రచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకు కొద్ది కిలోవిూటర్ల దూరంలో ఉండటం భారత్‌కు ఆందోళనకర అంశమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అరుణాచల్‌ప్రదేశ్‌, అక్సాయ్‌ చిన్‌లను తమ భూభాగంలో చూపుతూ చైనా మ్యాప్‌ను విడుదల చేయడం.. సరిహద్దుల వివాదాలను మరింత రగల్చడమేనని భారత్‌ అభిప్రాయపడిరది. చైనా ఆధారాల్లేకుండా మ్యాప్‌ను రూపొందించిందని.. అసంబద్ధమైన వాదనల ద్వారా ఇతరుల భూభాగాలను తమవని చెప్పుకోలేరని స్పష్టం చేసింది.