జట్టు కూర్పులో స్వల్పమార్పు.. ఉమేశ్‌ అవుట్‌.. అశోక్‌దిండా ఇన్‌!

న్యూఢిల్లీ, నవంబర్‌ 27:భారత్‌-ఇంగ్లాండు జట్ల మధ్య జరగనున్న 3,4 టెస్టుమ్యాచ్‌ల్లో ఆడనున్న జట్టు ఎంపిక పూర్తయింది. సందీప్‌పాటిల్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ మంగ ళవారంనాడు   జట్టును ప్రకటిం చింది. ఒకటి, రెండో టెస్టు మ్యాచ్‌ ల్లో కొనసాగిన ఆటగాళ్లనే కొనసా గించారు. జట్టులో స్వల్ప మార్పు మాత్రమే చోటు చేసుకుంది. వెన్నుగాయం తగ్గకపోవడంతో ఉమేశ్‌యాదవ్‌ స్థానంలో అశోక్‌ దిండాను తీసుకున్నారు.
3, 4 టెస్టులు ఇలా..
భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య మూడో టెస్టుకు కోల్‌కతా వేదిక కానున్నది. ఆ టెస్టు మ్యాచ్‌ డిసెంబర్‌ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. నాల్గో టెస్టు నాగ్‌పూర్‌లో కొనసాగనున్నది. ఆ మ్యాచ్‌ డిసెంబర్‌ 13న జరగనున్నది. అంతేగాక ఆ తరువాత 20-20 మ్యాచ్‌ల్లో భారత్‌-ఇంగ్లాండు జట్లు తలపడనున్నాయి. ఆ మ్యాచ్‌లు డిసెంబరు 20వ తేదీన పూనెలోను, 22వ తేదీన ముంబయిలోను జరగనున్నాయి.
హోరాహోరీ పోరు ఖాయం
భారత-ఇంగ్లాండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనున్నది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు ఉన్న విషయం తెలిసిందే. మరో విజయం కోసం ఇరు జట్ల మధ్య పోరు భారీగానే సాగుతుందని క్రికెట్‌ అభిమానులు పలువురు అంటున్నారు. మోతెర, వాంఖడేలలో చేసిన తప్పులను చేయకుండా ఉంటే భారత్‌ విజయం సాధించడం ఖాయమని చెబుతున్నారు. వాంఖడేలో మాదిరిగా ఇంగ్లాండు జట్టు సభ్యులు ఆడితే విజయం వారి పరమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీ స్కోరు చేసి భారీ విజయ లక్ష్యాన్ని ఇంగ్లాండుకు నిర్దేశించి ఆపై ఆ జట్టు వికెట్లను పడగొడితే విజయం ఈజీ అవుతుందని అంటున్నారు.  ఏదిఏమైనా ఎవరి లెక్కలు ఎలా ఉన్నా.. డిసెంబరు 5 వరకు ఆగాల్సిందే.