జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ 

– ఉగ్రవాది హతం
శ్రీనగర్‌, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో పుల్వామాలోని బాబ్‌గుంద్‌ ప్రాంతంలో ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలిపారు. భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. మృతి చెందిన ఉగ్రవాది వివరాలు, అతడు ఏ ఉగ్రసంస్థకు చెందిన వ్యక్తి అనే విషయాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ ముగిసిందని స్పష్టంచేశారు. రెండు రోజుల క్రితం జమ్ముకశ్మీర్‌లోని హంద్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్ర సంస్థకు చెందిన టాప్‌ కమాండర్‌ మనాన్‌ బషీర్‌ వని, మరో ఉగ్రవాది ఆశిఖ్‌ హుస్సేన్‌లు హతమయ్యారు.