జమ్మూలో ఎన్‌కౌంటర్‌

– ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్ముకశ్మీర్‌, నవంబర్‌10(జ‌నంసాక్షి) : పుల్వామా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. శనివారం తెల్లవారు జామున ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలోని తికెన్‌ గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు రాత్రంతా నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. శనివారం ఉదయం ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో ఆపరేషన్‌ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. పుల్వామా జిల్లాలోని ట్రాల్‌ పట్టణంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైష్‌-ఎ-మహ్మద్‌ ఉగ్ర సంస్థకు చెందిన ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇందులో ఓ జవానుకు గాయాలయ్యాయి. మృతి చెందిన ఉగ్రవాది పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి అని, ఇతడ్ని అన్వర్‌గా పిలుస్తారని పోలీసులు వెల్లడించారు. ఇతను గతంలో ట్రాల్‌ ప్రాంతంలో ఎంతో మంది పౌరులను వేధింపులకు గురి చేశాడని తెలిపారు.