జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీకి..

అమెరికా కోర్టు భారీ జరిమానా
–  రూ. 32కోట్లు జరిమానా విధిస్తూ తీర్పు
సెయింట్‌ లూయిస్‌, జులై13(జ‌నం సాక్షి) : జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీకి అమెరికా కోర్టు భారీ జరిమానా వేసింది. ఆ కంపెనీకి చెందిన టాల్కమ్‌ పౌడర్‌ను వాడడం వల్ల క్యాన్సర్‌ వచ్చినట్లు దాఖలైన పిటీషన్‌లో కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఆ పౌడర్‌ వల్ల అండాశయ క్యాన్సర్‌ వచ్చినట్లు కొందరు మహిళలు కంపెనీపై పిటీషన్‌ వేశారు. అయితే ఆ కంపెనీపై ఇప్పటికే అనేక కేసుల్లో జరిమానాలు వేశారు. తాజాగా మిస్సోరీ కోర్టు కూడా జాన్సన్‌ కంపెనీపై భారీ ఫైన్‌ వేసింది. నష్టపరిహారం కింద సుమారు రూ.32వేల కోట్లు (470 కోట్ల డాలర్లు) చెల్లించాలంటూ ఆదేశించింది. 22 మంది మహిళలకు ఆ నష్టపరిహారం అందాలని కోర్టు తెలిపింది. జాన్సన్‌ కంపెనీకి చెందిన బేబీ పౌడర్‌లో అస్‌బెస్టాస్‌ ఉన్నట్లు పరిశోధనలో తేల్చారు. దాని వల్లే
ఒవేరియన్‌ క్యాన్సర్‌ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జాన్సన్‌ కంపెనీ ఇలాంటివే సుమారు 9 వేల
కేసులను ఎదుర్కొంటోంది. అయితే తాజా జరిమానాను మాత్రం సెయింట్‌ లూయిస్‌లోని సర్క్యూట్‌ కోర్టు వేసింది. కోర్టురూమ్‌ వ్యూవ్‌ నెట్‌వర్క్‌లో వాదనలు ఆన్‌లైన్‌లో లైవ్‌ అయ్యాయి. ఒక కేసులో ఓ మహిళకు సుమారు 550 మిలియన్ల డాలర్ల ఫైన్‌ చెల్లించాలంటూ కోర్టు పేర్కొన్నది. కోర్టు తీర్పును వ్యతిరేకించిన కంపెనీ.. దానిపై అపీల్‌కు వెళ్లనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ కోర్టు తీర్పు ఇవ్వగానే కంపెనీ షేర్లు పడిపోయాయి.