టీనేజి బాలికపై అత్యాచారం

న్యూఢిల్లీ : టీనేజి బాలికపై అత్యాచారం చేసి.. ఆమెను తుపాకితో కాల్చి, బావిలోకి విసిరేశారు కొందరు దుండగులు. దాంతో.. పది గంటల పాటు ఆమె తనకు సాయం చేయాలంటూ అరుస్తూనే ఉంది. ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఉన్న తన ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఆమెను నవంబర్ 22వ తేదీన ముగ్గురు వ్యక్తులు ఓ తెల్ల ఎస్‌యూవీలో కిడ్నాప్ చేశారు. ఓ ఫాంహౌస్‌లోకి ఆమెను తీసుకెళ్లి, పదేపదే ఆమెపై అత్యాచారం చేశారు. డిసెంబర్ 5వ తేదీ రాత్రి ఆమెను అక్కడకు సమీపంలోని పొలానికి తీసుకెళ్లి, అక్కడ రెండుసార్లు ఆమెను తుపాకితో కాల్చారు. ఆమె బతకదని నిర్ణయించుకుని, బావిలో విసిరేశారు.

అయితే.. ఎలాగైనా బతకాలన్న గట్టి పట్టుదలతో ఉన్న ఆ బాలిక.. తనకు దిగిన బుల్లెట్లలో ఒకదాన్ని తానే తీసేసుకుంది. డిసెంబర్ 6వ తేదీన ఆ పొలం యజమాని మేనల్లుడు ఆడుకుంటూ బావి వద్దకు వెళ్లగా.. బాలిక అరుపులు వినిపించాయి. తొలుత తాను అతడి మాటలు నమ్మలేదని, తర్వాత వెళ్లి చూస్తే నిజంగానే బాలిక అరుపులు వినిపించాయని, పోలీసులకు విషయం చెప్పి.. లోపలకు తాళ్లు వదిలానని పొలం యజమాని చెప్పారు. ఆమెను జాగ్రత్తగా పైకి లాగి.. వివస్త్రగా ఉండటంతో ఓ దుప్పటి కప్పారు. తర్వాత ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించారు. ఈ కేసులో నిందితులు ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు.