టోల్గేట్ల వద్ద స్వైపింగ్ మెషిన్
పాత నోట్ల రద్దుతో అవస్థలు పడుతున్న ప్రజలను గట్టెక్కించేందుకు కార్డుల వినియోగాన్ని పెంచాలని కేంద్రం నిర్ణయించింది. సరకు రవాణా వ్యవస్థకు ఆటంకం లేకుండా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారుల టోల్గేట్ల వద్ద క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ యంత్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. నగదు సమస్యతో సరకు రవాణా నిలిచిపోయి నిత్యవసరాల ధరలు పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. రద్దయిన రూ.500, 1000 నోట్లను టోల్గేట్ల వద్ద తీసుకునే గడువును డిసెంబరు 2వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఏపీ రవాణా శాఖ అన్ని చెక్పోస్టులు, కార్యాలయాల్లోనూ కార్డు ద్వారా చెల్లింపులకు వీలుగా యంత్రాలను ఏర్పాటు చేసింది. ఆ ప్రయోగం సఫలమవడంతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ప్రతి టోల్గేటు వద్ద 10కి తగ్గకుండా స్వైపింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచాలని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని టోల్గేట్ల వద్ద టోల్ రుసుము వసూలుకు ఆరు నుంచి ఎనిమిది వరకు బూత్స్ ఉన్నాయి. వీటిలో ఒక్కో యంత్రాన్ని ఉంచుతారు.