డబ్బున్న వారికే వైద్యవిద్య : పిడిఎస్‌యు

ఖమ్మం, జూలై 25 : డబ్బు ఉన్న వారి పిల్లలకే రాష్ట్రంలో వైద్య విద్య లభించే పరిస్థితి ఏర్పడిందని పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌కుమార్‌ ఆరోపించారు. రాష్ట్రంలోని 24 ప్రైవేట్‌ వైద్య కళాశాలలో సి-కేటగిరిలో యాజమాన్య కోటా ద్వారా ఇంటర్‌ మెరిట్‌ విద్యార్థులతో భర్తీ చేయాలని 136 జీవోను ప్రవేశపెట్టిన ప్రభుత్వం అమలులో విఫలమైందని అన్నారు. సి-కేటగిరి కింద 1200 ఎంబిబిఎస్‌ సీట్లు, 800 డిడిఎఫ్‌ సీట్లు భర్తీ చేయాల్సి ఉండగా ప్రభుత్వ ఉదాసీనత వల్ల యాజమాన్యాలు ఇష్టమొచ్చిన రీతిలో భర్తీ చేస్తున్నారని అన్నారు. దీంతో రాష్ట్రంలో డబ్బున్న వారికే సీట్లు లభిస్తున్నాయని అన్నారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.