డీఎంకే, కాంగ్రెస్ మధ్య కుదిరిన ఒప్పందం

7iurvckmచెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు కలసి బరిలోకి దిగనున్నాయి. సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ 41 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.

ఏఐసీసీ నేత గులాం నబీ ఆజాద్ సోమవారం ఉదయం చెన్నైలో డీఎంకే చీఫ్‌ కరుణానిది నివాసానికి వెళ్లి సీట్ల పంపకాల విషయంపై చర్చించారు. సీట్ల విషయంలో కాంగ్రెస్ ఓ మెట్టు దిగగా, డీఎంకే బెట్టుసడలించింది. దీంతో కరుణతో ఆజాద్ చర్చలు ఫలించాయి. ఈ సమావేశంలో కరుణ కుమారుడు స్టాలిన్, తనయ కనిమొళి ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. తమిళనాడు ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే, డీఎంకే కూటమి, డీఎండీకే చీఫ్ కెప్టెన్ విజయ్కాంత్ సారథ్యంలోని పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ పోటీ చేస్తున్నాయి. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలున్నాయి.