ఢిల్లీ,కేరళలో కరోనా విజృంభణ

దిల్లీ,నవంబరు 4 (జనంసాక్షి): దేశ రాజధాని నగరం దిల్లీ, కేరళలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ అక్కడ కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దిల్లీలో వరుసగా రెండో రోజూ 6వేలకు పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. నిన్న 6,725 కేసులు రాగా.. ఈ రోజు 6,842 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 51 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 6,703కి పెరిగింది. కొత్త కేసులతో కలిపి దిల్లీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,09,938కి పెరిగింది. అలాగే, 3,65,866 మంది కోలుకోగా.. ప్రస్తుతం 37,369 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరోవైపు, దిల్లీలో కరోనా వైరస్‌ మూడో విజృంభణ మొదలైనట్టు సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. ఎవరూ భయపడొద్దని సూచించారు.

కేరళలో మరో 28 మంది మృతి

కేరళలో గడిచిన 24 గంటల్లో 71,270 శాంపిల్స్‌ పరీక్షించగా.. 8,516 కొత్త కేసులు వచ్చాయి. మరో 28 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి దాకా 48.60లక్షల శాంపిల్స్‌ పరీక్షించగా.. 4.48 లక్షల మందిలో కరోనా ఉన్నట్టు తేలింది. తాజాగా మరో 8,206 మంది కోలుకోగా ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 3.72 లక్షలకు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,587 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 84,995 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ఆరోగ్యమంత్రి కేకే శైలజ తెలిపారు.