ఢిల్లీలో కేటీఆర్ బిజీ బిజీ
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 8,(జనంసాక్షి):ఇన్వెస్ట్ ఇండియా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున టీఎస్ – ఐపాస్, టీ హబ్ లపై పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చిన తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్.శుక్రవారం ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుతో తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎన్ ఆర్ ఐ సంక్షేమం, మున్సిపల్ శాఖల మంత్రి కె. తారక రామారావు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు ఏయిర్ పోర్ట్ ల అభివృద్ధి, రీజినల్ కనెక్టివిటీ స్కీం ( ఆర్ సిఎస్) అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారం అందించాలని సమావేశంలో భాగంగా మంత్రి కె. తారకరామారావు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. మేకిన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఇన్వెస్ట్ ఇండియా కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావు, తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్వెస్ట్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ బాగ్లా, ఇన్వెస్ట్ ఇండియా సంస్థ వైస్ ప్రెసిడెంట్ దుశ్యంత్ ఠాకూర్ లతో మంత్రి కె. తారక రామారావు భేటి అయ్యారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, తెలంగాణ లో అంతర్జాతీయ బహుళ కంపెనీల ఏర్పాటు, తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటీ పరిశ్రమల అభివృద్ధిని గుర్తిస్తూ పలు సంస్థలు అందిస్తున్న అవార్డుల గురించి మంత్రి కె.తారక రామారావు ఇన్వెస్ట్ ఇండియా సీఈఓ, వైస్ ప్రెసిడెంట్లకు వివరించారు. ఐటీ రంగాన్ని, పరిశ్రమలను ప్రోత్సహించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, మౌళిక వసతులను ఇన్వెస్టర్లకు వివరించారు. ఈ సందర్భంగా తైవాన్ ఇన్వెస్టర్ల బృందంతో భేటి అయిన ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ టీఎస్ – ఐపాస్, టీ హబ్ అమలుతీరుపై పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇన్వెస్ట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశంలో పలు అంతర్జాతీయ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న పలువురు ఇన్వెస్టర్లు తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖం వ్యక్తం చేసినట్లు ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ తెలిపారు. ఇన్వెస్ట్ ఇండియా కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ ల మంత్రి కె. తారక రామారావు తో పాటూ, తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్, తెలంగాణ రాష్ట్ర డెరెక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి లు పాల్గొన్నారు.