తక్షణం మహిళా రిజర్వేషన్‌ అమలు చేయండి

` లేదంటే డెడ్‌లైన్‌ పెట్టండి.. బీఆర్‌ఎస్‌ డిమాండ్‌
న్యూఢల్లీి(జనంసాక్షి): పార్లమెంట్‌లో ఇప్పటి వరకు అయిదు సార్లు మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టినట్లు బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరావు తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ఇవాళ ఆయన లోక్‌సభలో మాట్లాడారు. గతంలో దేవగౌడ, వాజ్‌పేయి ప్రధానులుగా ఉన్న సమయంలో, 13వ లోక్‌సభలో మహిళా బిల్లును ప్రవేశపెట్టారని, 15వ రాజ్యసభలో ఆ బిల్లు పాసైందని, ఇప్పుడు అయిదోసారి లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని, ఇది మా పార్టీ విధాన నిర్ణయమన్నారు.2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత.. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన 12 రోజుల్లోనే లెజిస్టేటివ్‌ అసెంబ్లీలో 33 శాతం రిజర్వేషన్‌ మహిళలకు కల్పించేందుకు తీర్మానం చేసినట్లు గుర్తు చేశారు. మహిళల సంక్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. సర్పంచ్‌, జెడ్సీసీ, ఎంపీటీసీల్లో.. మహిళలకు తమ ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తోందన్నారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, మార్కెట్‌ కమిటీల్లోనూ తెలంగాణ సర్కార్‌ మహిళలకు రిజర్వేషన్‌ ఇచ్చినట్లు నామా తెలిపారు.తక్షణమే మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమలు చేయాలని ఎంపీ నామా డిమాండ్‌ చేశారు. రాబోయే ఎన్నికల్లోనే ఆ బిల్లును అమలు చేయాలన్నారు. లేదంటే దానికి ఓ డెడ్‌లైన్‌ విధించాలని కోరారు. నియోజకవర్గాల పునర్‌ విభజనతో పాటు రిజర్వేషన్‌ అమలు విషయంలో డెడ్‌లైన్‌ ఉండాలని బీఆర్‌ఎస్‌ ఎంపీ సూచించారు.